Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఎవ‌రి పార్టీ అనేది తేలిపోయింది

సీఎం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు తాము న్యాయపరంగానే పోరాడామని సజ్జల చెప్పారు. ఆ తర్వాత ప్రజాకోర్టులో సీఎం జగన్‌ తిరుగులేని విజయం సాధించారని తెలిపారు.

టీడీపీ ఎవ‌రి పార్టీ అనేది తేలిపోయింది
X

టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలి ఈవెంట్‌తో అందరికీ తెలిసిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆదివారం నాడు టీడీపీ స్టేక్‌ హోల్డర్స్‌ అంతా కలిసి చేపట్టిన ఈవెంట్‌ చూస్తే.. వారికి ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదని అనిపించిందన్నారు. చంద్రబాబు జైలులో ఉంటే.. ఆయనకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాన్ని ఏదో మ్యూజికల్‌ ఈవెంట్‌కి రిహార్సల్‌ చేసినట్లు ప్రదర్శన చేశారని ఎద్దేవా చేశారు.

టీడీపీ చేస్తున్న డ్రామాలను ప్రజలు పట్టించుకోవడం లేదని సజ్జల తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ భావోద్వేగానికి అవకాశం ఉండే అంశం కాదని, ప్రాథమిక ఆధారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండుకు పంపిందని తెలిపారు. టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. చంద్రబాబు జైలులో ఉండటం దారుణం అన్న రీతిలో టీడీపీ వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో వేర్వేరు కారణాలతో చనిపోయినవారిని కూడా చంద్రబాబు కోసమే మృతిచెందినట్టు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

సీఎం జగన్‌పై తప్పుడు కేసులు పెట్టినప్పుడు తాము న్యాయపరంగానే పోరాడామని సజ్జల చెప్పారు. ఆ తర్వాత ప్రజాకోర్టులో సీఎం జగన్‌ తిరుగులేని విజయం సాధించారని తెలిపారు. 2019లో 151 సీట్లలో గెలిచి అధికారంలోకి వచ్చారన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, తాము సంక్షేమ పాలన అందించామని చెప్పి ప్రజల ముందుకు వెళుతున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీనీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్‌ అని సజ్జల తెలిపారు.

First Published:  31 Oct 2023 2:01 AM GMT
Next Story