Telugu Global
Andhra Pradesh

బుట్టా రేణుకకు వైసీపీ బంపర్ ఆఫర్‌..!

మాజీ ఎంపీ బుట్టా రేణుకకు వైసీపీ అధినేత బంపర్ ఇచ్చారని తెలుస్తోంది. ఆమెకు ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు ఫైనల్ చేసినట్లు సమాచారం.

బుట్టా రేణుకకు వైసీపీ బంపర్ ఆఫర్‌..!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ అధినేత జగన్‌ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పు ప్రక్రియ ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఇప్పటికే ఇన్‌ఛార్జిలను ప్రకటించిన చోట అవసర‌మైతే మళ్లీ మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు.

తాజాగా మాజీ ఎంపీ బుట్టా రేణుకకు వైసీపీ అధినేత బంపర్ ఇచ్చారని తెలుస్తోంది. ఆమెకు ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటు ఫైనల్ చేసినట్లు సమాచారం. ముందుగా ఎమ్మిగనూరు ఇన్‌ఛార్జిగా మాచాని వెంకటేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఐతే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మాచానికి సహకరించబోనని తేల్చి చెప్పడంతో తాజాగా మాచానిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుట్టా రేణుకా, చెన్నకేశవ రెడ్డితో కలిసి జగన్‌తో సమావేశమయ్యారు. ఎమ్మిగనూరు టికెట్‌ బుట్టాకు ఇస్తే సహకరించేందుకు చెన్నకేశవ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. 2014లో కర్నూలు స్థానం నుంచి ఎంపీగా గెలిచారు బుట్టా రేణుకా.

ఇక ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయించేందుకు జగన్‌ నిర్ణయించారు. ఐతే జయరాం ఎంపీగా వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానానికి గుమ్మనూరు అందుబాటులో లేరని సమాచారం. దీంతో కర్నూలు ఎంపీ స్థానానికి కర్నూలు మేయర్‌గా ఉన్న BY రామయ్యను ఎంపీగా పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ స్థానం నుంచి BY రామయ్యల పేర్లను శనివారం అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

First Published:  26 Jan 2024 10:29 AM GMT
Next Story