Telugu Global
Andhra Pradesh

`జయహో బీసీ`తో టెన్షన్ మొదలైనట్లేనా..?

పంచాయతీ నుండి పార్లమెంటు వరకు వైసీపీలో 87 వేలమంది బీసీ ప్రజాప్రతినిధులున్న విషయం ప్రపంచానికి మొదటిసారి తెలిసింది. నిజానికి ఇన్నివేలమంది ప్రజాప్రతినిధులున్నట్లు అసలు వైసీపీలోని బీసీ మంత్రులు, ఎంపీలకు కూడా తెలియ‌దేమో.

`జయహో బీసీ`తో టెన్షన్ మొదలైనట్లేనా..?
X

వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన జయహో బీసీ స‌భ గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. అసలు సదస్సు నిర్వహణ ముఖ్య ఉద్దేశ‌మే ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా తెలుగుదేశంపార్టీని కార్నర్ చేసేయటం. ఈ మ‌హాస‌భ ద్వారా జగన్ హైలైట్ చేయాలని అనుకున్నదేమంటే తమ హయాంలో ఎంతమంది బీసీలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారనే సంఖ్యను అందరికీ తెలియజేయటమే. ఆ పాయింటే ఇక్కడ బాగా హైలైట్ అయ్యింది.

ఇప్పటివరకు ఎవరు మాట్లాడినా బీసీలకు తాము అన్నిపదవులు ఇచ్చాము.. ఇన్ని పదవులిచ్చామని మాత్రమే చెబుతున్నారు. పైగా దాన్ని పర్సంటేజ్ రూపంలో చెబుతున్నారు. పర్సంటేజ్ రూపంలో చెబితే సంఖ్య తెలీదు. ఇప్పటివరకు చంద్రబాబునాయుడు అండ్ కో ఎన్నిసార్లు చెప్పినా పర్సెంటేజ్ రూపంలో మాత్రమే చెబుతున్నారు. అదే ఇప్పుడు జగన్ ఒకడుగు ముందుకేసి ఎన్ని వేలమందికి తాము అవకాశం ఇచ్చామో అందరికీ తెలిసేట్లు చెప్పారు.

పంచాయతీ నుండి పార్లమెంటు వరకు వైసీపీలో 87 వేలమంది బీసీ ప్రజాప్రతినిధులున్న విషయం ప్రపంచానికి మొదటిసారి తెలిసింది. నిజానికి ఇన్నివేలమంది ప్రజాప్రతినిధులున్నట్లు అసలు వైసీపీలోని బీసీ మంత్రులు, ఎంపీలకు కూడా తెలియ‌దేమో. ఒకపార్టీ తరపున ఇన్ని వేలమంది ప్రజాప్రతినిధులుండటం ఆశ్చర్యంగానే ఉంది. మామూలుగా ఏ పార్టీ పెట్టినా బీసీ సామాజికవర్గాలతో సమావేశాలు పెట్టడాన్నే అందరూ చూసింది. కానీ, జగన్ మాత్రం అచ్చంగా బీసీల్లోని ప్రజాప్రతినిధులతోనే సదస్సు నిర్వహించారు. దీనివల్లే 87 వేలమంది ఉన్నట్లు తెలిసిందే. ఇక్కడే ప్రతిపక్షాలు కార్నర్ అయిపోయాయి.

తమ పార్టీ తరపున ఇన్నివేలమంది ప్రజాప్రతినిదులున్నట్లు వైసీపీ సాధికారికంగా చెప్పిన లెక్కను ప్రతిపక్షాలు కాదనే అవకాశంలేదు. పర్సంటేజీలు చెబితే ఎవరికీ లెక్కతెలీదనే ఇప్పుడు జగన్+మంత్రులు, సీనియర్ నేతలు 87 వేలమంది అని నొక్కి పదేపదే చెప్పారు. ఇప్పుడు చెప్పిన 87 వేలలెక్కే బీసీ సామాజికవర్గంలో కూడా బాగా ఎక్కుతుంది. దీన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా కాదనేందుకు లేదు, ఒకవేళ వీళ్ళు కాదన్నా బీసీలు పట్టించుకోరు. జగన్ కు కావాల్సిందిదే. అందుకనే బీసీ ప్రజాప్రతినిధుల సదస్సు ద్వారా జగన్ ప్రతిపక్షాలను కార్నర్ చేసేశారు.

First Published:  8 Dec 2022 4:50 AM GMT
Next Story