Telugu Global
Andhra Pradesh

టీడీపీ మద్దతుతోనే వీళ్ళు పోటీచేస్తారా..?

విజయవాడ అయితే వాళ్ళ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒంగోలు అయితే జేపీ సొంత జిల్లానట. అందుకనే పై రెండు నియోజకవర్గాల్లో పోటీపై ఆలోచిస్తున్నట్లు టాక్.

టీడీపీ మద్దతుతోనే వీళ్ళు పోటీచేస్తారా..?
X

లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ (జేపీ) వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని తీసుకున్న నిర్ణయం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జేపీ తన దృష్టిని ఎప్పుడూ ఏపీ పాలిటిక్స్ పై పెట్టిందిలేదు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కూడా హైదరాబాద్ లోని కూకట్ పల్లి నియోజకవర్గంలోనే. 2014 ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంటుకు పోటీచేసినా డిపాజిట్ కూడా దక్కలేదు. అప్పటినుండి ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపు దూరంగానే ఉంటున్నారు.

అలాంటిది ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవ్వాలని అందులోనూ ఎంపీగా పోటీచేయబోతున్నట్లు ప్రకటన రాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. జేపీకి ఎవరు ఓట్లేస్తారనే చర్చ మొదలైంది. అయితే తాజా సమాచారం ఏమిటంటే తెలుగుదేశంపార్టీ మద్దతుతోనే జేపీ ఎన్నికల్లో పోటీచేయబోతున్నారట. పోటీచేసేది లోక్ సత్తా బ్యానర్ పైనే అయినా మద్దతు మాత్రం తమ్ముళ్ళదేనట. పైగా విజయవాడ లేదా ఒంగోలు పార్లమెంటు సీట్లలో ఒకదాని నుండి పోటీకి రెడీ అవుతున్నట్లు సమాచారం.

విజయవాడ అయితే వాళ్ళ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒంగోలు అయితే జేపీ సొంత జిల్లానట. అందుకనే పై రెండు నియోజకవర్గాల్లో పోటీపై ఆలోచిస్తున్నట్లు టాక్. ఇక సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పనిచేసిన లక్ష్మీనారాయణ కూడా టీడీపీ మద్దతుతోనే రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన వైజాగ్ నుండి పోటీచేయాలని అనుకుంటున్నారట. లక్ష్మీనారాయణ ఇండిపెండెంట్ గా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాదు కూడదంటే అప్పుడు టీడీపీ కండువా కప్పుకోవచ్చని టీడీపీ వర్గాలు చెప్పాయి.

వీళ్ళిద్దరికీ మేధావులుగా మధ్య తరగతి వర్గాల్లో మంచి పేరుంది. వీళ్ళకున్న గుడ్ విల్ విల్లుకు గట్టి మద్దతు తోడైతే గెలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం తర్వాతే వచ్చే ఎన్నికల్లో వీళ్ళ సేవలను పార్లమెంటులో ఉపయోగించుకోవాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారట. అందుకనే తాను తెరవెనుక ఉండి వీళ్ళిద్దరినీ ముందుకు నెడుతున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.

First Published:  26 Oct 2022 7:16 AM GMT
Next Story