Telugu Global
Andhra Pradesh

కొడుకులొచ్చి ఆస్తి కోసం గొడ‌వ చేస్తార‌ని.. - ఇంట్లోనే భ‌ర్త‌కు ద‌హ‌న సంస్కారాలు

త‌మ కుమారులిద్దరూ తమను సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

కొడుకులొచ్చి ఆస్తి కోసం గొడ‌వ చేస్తార‌ని.. - ఇంట్లోనే భ‌ర్త‌కు ద‌హ‌న సంస్కారాలు
X

చ‌నిపోయిన భ‌ర్త‌కు ఇంట్లోనే ద‌హ‌న సంస్కారాలు చేసింది ఓ భార్య‌. తండ్రి చ‌నిపోయిన విష‌యం తెలిస్తే కొడుకులిద్ద‌రూ వ‌చ్చి ఆస్తి కోసం గొడ‌వ చేస్తార‌నే భ‌యంతో ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్టు ఆమె వివ‌రించింది. హృద‌యాన్ని క‌దిలించేలా ఉన్న ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండలో సోమ‌వారం ఉద‌యం జ‌రిగింది. దీనికి సంబంధించి ప‌త్తికొండ‌ పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ ప‌ట్ట‌ణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత భార్యాభర్తలు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. దంప‌తులిద్ద‌రూ ప‌త్తికొండ‌లోనే ఉంటూ.. మెడిక‌ల్ షాప్‌ నిర్వ‌హిస్తూ జీవ‌నం సాగిస్తున్నారు.

సోమవారం ఉదయం హరికృష్ణప్రసాద్ ఇంటి నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడాన్ని గమనించిన కాలనీ వాసులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య లలితతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. తన భర్త అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతిచెందినట్టు ఆమె పోలీసుల‌కు వివ‌రించింది.

త‌మ కుమారులిద్దరూ తమను సరిగా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆ భ‌యంతోనే త‌న‌ భర్తకు ఇంట్లోనే అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తిచేసినట్టు ఆమె వెల్ల‌డించింది. గుండె బ‌రువెక్కేలా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

First Published:  29 May 2023 8:24 AM GMT
Next Story