Telugu Global
Andhra Pradesh

కానిస్టేబుల్ భార్య‌.. ప్రియుడి మోజులో ప‌డి.. - భ‌ర్త‌నే హ‌త‌మార్చిన దారుణం

ఎదురింట్లో ఉంటున్న రామారావుతో శివ‌జ్యోతి ఏడాదిన్న‌ర‌గా వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తోంది. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో రామారావుతో క‌లిసి కొన్నిరోజులు బ‌య‌టికి వెళ్లిపోయింది.

కానిస్టేబుల్ భార్య‌.. ప్రియుడి మోజులో ప‌డి.. - భ‌ర్త‌నే హ‌త‌మార్చిన దారుణం
X

ఆమె ఓ కానిస్టేబుల్ భార్య‌.. ఎదురింటి వ్య‌క్తితో ఏడాదిన్న‌ర‌గా వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తోంది. అది బ‌య‌ట‌ప‌డిపోవ‌డంతో భ‌ర్త‌నే హ‌త‌మార్చి అడ్డు తొల‌గించుకోవాల‌నుకుంది. ప్రియుడితో క‌లిసి అందుకు ప్లాన్ చేసి అమ‌లు చేసింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానంతో పోలీసులు లోతుగా విచార‌ణ చేయ‌గా అస‌లు విష‌యం వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల‌ను నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ శుక్రవారం వెల్లడించారు.

విశాఖ‌ప‌ట్నం వ‌న్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్ కుమార్ (40) భార్య శివజ్యోతి అలియాస్ శివానితో కలిసి ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. వారికి 3, 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన రమేష్ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందాడంటూ అత‌ని భార్య ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లి ప‌రిశీలించిన సీఐ మ‌ల్లేశ్వ‌ర‌రావు.. ర‌మేష్ భార్య ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానంతో లోతుగా విచార‌ణ చేప‌ట్టారు. పోస్టుమార్టం నివేదిక‌లో అత‌ను ఊపిరాడ‌క మృతిచెందిన‌ట్టు తేలింది. దీంతో పోలీసులు త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేప‌ట్ట‌గా వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఎదురింట్లో ఉంటున్న రామారావుతో శివ‌జ్యోతి ఏడాదిన్న‌ర‌గా వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తోంది. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో రామారావుతో క‌లిసి కొన్నిరోజులు బ‌య‌టికి వెళ్లిపోయింది. ఇరువర్గాల కుటుంబీకులు రమేష్‌కు నచ్చజెప్పి శివజ్యోతిని ఇంటికి తీసుకొచ్చారు. అయినా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ర‌మేష్ శివ‌జ్యోతిని రామారావు ద‌గ్గ‌ర‌కే వెళ్లిపోవాల‌ని మండిప‌డేవాడు. పిల్లలను తీసుకొని వెళ్తానని వాదించడంతో ఇద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి.

ఈ క్ర‌మంలోనే రమేష్ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివజ్యోతి ప‌న్నాగం పన్నింది. ఆమె వద్దనున్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. అప్పుఘర్‌కు చెందిన వెల్డింగ్ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చారు. ఒకటో తేదీ రాత్రి రమేష్ ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయారు. అనంతరం నీలాను పిలిచారు. రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా అదిమిపట్టుకోగా, కదలకుండా శివజ్యోతి కాళ్లు పట్టుకొంది. దీంతో ర‌మేష్ ప్రాణాలు కోల్పోయాడు. రామారావు ఇంటి బయట ఎవరూ రాకుండా వేచి ఉన్నాడు. భ‌ర్త హ‌త్య త‌ర్వాత డ‌బ్బు, ఉద్యోగం కూడా వ‌స్తుంద‌ని, ఆ త‌ర్వాత రామారావుతో క‌లిసి ఉండాల‌ని శివ‌జ్యోతి భావించింది. ఈ కేసులో నిందితులు శివ‌జ్యోతి, రామారావు, ఎరిగా నీలాల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

First Published:  5 Aug 2023 6:17 AM GMT
Next Story