Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఎందుకు భయపడుతోంది..?

అంతకుముందు వరకు తమ పార్టీకి వచ్చిన విరాళాన్నీ సక్రమమే అని అచ్చెన్నాయుడుతో సహా చాలామంది సీనియర్లు ప్రకటించారు.

టీడీపీ ఎందుకు భయపడుతోంది..?
X

టీడీపీ ఎందుకు భయపడుతోంది..?

తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. మీడియా ముందు ప్రత్యర్ధులను అనేక విషయాలపై సవాళ్ళు చేస్తారు. తొడలు కొడతారు, జబ్బలు చరుస్తారు. అయితే అసలు విషయానికి వచ్చేసరికి వెంటనే స్టే కోసం కోర్టులో కేసు వేస్తారు. ఇప్పుడు జరిగిందిదే. స్కిల్ స్కామ్ లో రూ. 371 కోట్లకు చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ కేసు నమోదుచేసి అరెస్టుచేసింది. గుర్తించిన అవినీతిలో రూ. 27 కోట్లు టీడీపీ ఖాతాలో జమైందని సీఐడీ ఆరోపణలు చేసింది.

తమ ఆరోపణకు మద్దతుగా పార్టీ ఖాతాలను పరిశీలించాలని చెప్పి టీడీపీకి నోటీసులు జారీచేసింది. అంతకుముందు వరకు తమ పార్టీకి వచ్చిన విరాళాన్నీ సక్రమమే అని అచ్చెన్నాయుడుతో సహా చాలామంది సీనియర్లు ప్రకటించారు. స్కామ్ డబ్బుల్లో రూ. 27 కోట్లు తమ పార్టీకి అందినట్లు సీఐడీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని మండిపడ్డారు. తీరా ఖాతాలను పరిశీలించాలని సీఐడీ నోటీసులు జారీ చేసేటప్పటికి టీడీపీ వెంటనే కోర్టులో పిటీషన్ వేసింది.

తమ పార్టీ ఖాతాలను సీఐడీ పరిశీలించకుండా అడ్డుకోవాలని కోర్టులో టీడీపీ పిటీషన్ వేసింది. దానిపై విచారణ జరుగుతున్నది. ఇక్కడే టీడీపీ భయమంతా బయటపడుతోంది. టీడీపీకి వచ్చిన విరాళాన్నీ పారదర్శకమే అయితే సీఐడీ తనిఖీని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అన్నదే కీలకమైన పాయింట్. అభ్యంతరం చెప్పటమే కాకుండా ఏకంగా కోర్టులో పిటీషన్ వేయటంతోనే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఖాతాలను పరిశీలించకుండా టీడీపీ కోర్టులో పిటీషన్ వేసి అడ్డుకుంటున్నది అంటే కచ్చితంగా స్కిల్ స్కామ్ ముడుపులు టీడీపీ ఖాతాలో పడిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

స్కిల్ స్కామ్ ముడుపుల అంశంలో లాజికల్ ఎండ్ జరగాలంటే పార్టీ ఖాతాలను సీఐడీ తనిఖీ చేయాల్సిందే అని కోర్టులో వాదిస్తోంది. కాబట్టి కోర్టు కూడా సీఐడీ వాదనకే మద్దతుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ ఖాతాలో పడిందని ఆరోపిస్తున్న రూ.27 కోట్ల వ్యవహారం తేలాలంటే ఖాతాల తనిఖీ తప్పనిసరి. కోర్టు గనుక సీఐడీ వాదనకే మద్దతుగా స్పందిస్తే అప్పుడు టీడీపీ ఏ విధంగా అడుగేస్తుందో చూడాలి.

First Published:  28 Oct 2023 7:48 AM GMT
Next Story