Telugu Global
Andhra Pradesh

వ్యూహకర్తలు చేతులెత్తేశారా..?

వాళ్ళ ఆరోపణలకు దీటైన సమాధానాలు చెప్పటంలో చంద్రబాబు ఫెయిలయ్యారనే చెప్పాలి. సరే రాజకీయంగా చంద్రబాబు అండ్ కో ఫెయిలయ్యారనే అనుకుందాం, మరి వ్యూహకర్తలంతా ఏమైనట్లు..?

వ్యూహకర్తలు చేతులెత్తేశారా..?
X

ఇప్పుడిదే విషయంపై పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. ఏరికోరి తెచ్చుకున్న టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ, ఈమధ్యనే వచ్చి చేరిన శాంతనుసింగ్ అండ్ కో అంతా ఏమి చేస్తున్నట్లు..? నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఘటన అలా జరిగిందో లేదో.. మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబును అన్నీ వైపుల నుంచి వాయించేస్తున్నారు.

వీళ్ళదెబ్బను తట్టుకోలేకే చనిపోయిన వారి కుటుంబాలకు టీడీపీ తరపున తలా రు. 25 లక్షలు ఇచ్చుకోవాల్సొచ్చింది. ఘటన జరగ్గానే రు. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించిన చంద్రబాబు ఆ మొత్తాన్ని పాతిక లక్షలకు పెంచటంతోనే అర్థ‌మైపోయింది ఎంతటి డిఫెన్సులో పడిపోయారో.. ప్రచారపిచ్చితో చంద్రబాబు కావాలనే తన సభలను ఇరుకుసభల్లో పెట్టుకుంటున్నట్లు జగన్మోహన్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు తప్పని చంద్రబాబు తిప్పికొట్టలేకపోతున్నారు.

వాళ్ళ ఆరోపణలకు దీటైన సమాధానాలు చెప్పటంలో చంద్రబాబు ఫెయిలయ్యారనే చెప్పాలి. సరే రాజకీయంగా చంద్రబాబు అండ్ కో ఫెయిలయ్యారనే అనుకుందాం, మరి వ్యూహకర్తలంతా ఏమైనట్లు..? అసలిలాంటి ఇరుకుసందుల్లో సభలు పెట్టాలని సూచించిందే వ్యూహకర్తలని పార్టీలో టాక్. అసలు వ్యూహకర్తల పనేంటి..? సర్వకాల సర్వావస్ధల్లో తమ క్ల‌యింట్ కు లాభం జరిగేట్లు చూడటమే కదా.

ఒక కార్యక్రమం డిజైన్ చేసేటప్పుడు ఏదన్నా జరగరానిది జరిగితే తమ క్ల‌యింట్ ఇమేజికి ఎలాంటి డ్యామేజి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యూహకర్తలదే. కానీ, ఇప్పుడు కందుకూరు ఘటనలో జరిగిందేమిటి..? చంద్రబాబు ప్రారంభించిన 'ఇదేం ఖర్మ..రాష్ట్రానికి' రివర్స్ అయ్యి చంద్రబాబు ప్రోగ్రామ్ తో మనకిదేం ఖర్మ అని జనాలు అనుకునేట్లుగా తయారైంది. డిఫెన్సులో పడిపోయిన చంద్రబాబును చూస్తుంటే వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేతులెత్తేసినట్లు అర్ధమవుతోంది. ఇలాంటి వ్యూహకర్తలను పెట్టుకుని చంద్రబాబు సాధించేదేముంటుంది ? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎలాగవస్తారో ? అనుమానమే.

First Published:  1 Jan 2023 8:05 AM GMT
Next Story