Telugu Global
Andhra Pradesh

కావాలనే లక్ష్మీని దూరం పెట్టారా?

పురందేశ్వరి ఒత్తిడి వల్లే రాష్ట్రప్రతి భవన్ లక్ష్మీపార్వతికి ఆహ్వానం పంపలేదని సమాచారం. ఇలాంటి కారణంతోనే ఎన్టీయార్‌కు భారతరత్న పురస్కారం కూడా రావటంలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే.

కావాలనే లక్ష్మీని దూరం పెట్టారా?
X

ఎన్టీయార్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్న 100 రూపాయల కాయిన్ ప్రోగ్రామ్ వివాదాస్పదమవుతోంది. ఈనెల 28న ఎన్టీయార్ బొమ్మతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కాయిన్‌ను విడుదల చేయబోతోంది. ఈ కాయిన్ జనాల్లో సర్క్యులేషన్లోకి రాదు. ఎందుకంటే మిగిలిన కాయిన్‌లా దీనికి కరెన్సీగా చెలామణి ఉండదు. కాయిన్‌ కలెక్ట్ చేసుకునే ఆసక్తి ఉన్నవాళ్ళకి మాత్రమే ఎన్టీయార్ కాయిన్ అందుబాటులో ఉంటుంది.

కాయిన్ ముద్రించటం అన్నది ఎన్టీయార్‌ను గౌరవించటంగానే భావించాలి. అయితే ఆ గౌరవించటంలో మళ్ళీ కేంద్రం తప్పులు ఎందుకు చేస్తోందో అర్థంకావటంలేదు. కాయిన్‌ను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయబోతున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి రావాలని ఎన్టీయార్ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరునా రాష్ట్రపతి భవన్ ఆహ్వానించింది. ఎన్టీయార్ కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనుమ‌లు, మనవరాళ్ళు అందరికీ ఆహ్వానం అందింది.

అయితే ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతికి మాత్రం ఆహ్వానం అందలేదు. ఇప్పుడు ఈ విషయమే వివాదాస్పదమవుతోంది. ప్రోగ్రామ్‌కు తనను ఎందుకు పిలవలేదని అడుగుతూ లక్ష్మీపార్వాతి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు లేఖలు రాశారు. ఎన్టీయార్ పేరుతో రిలీజ్ చేస్తున్న కాయిన్‌ను అందుకోవాల్సింది ఆయన భార్య హోదాలో లక్ష్మీపార్వతే. అయితే ఆమెను ఎన్టీయార్ కుటుంబ సభ్యులు దూరంగానే ఉంచారు. లక్ష్మీపార్వతిని ఎన్టీయార్ భార్యగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవటంలేదు. అది వాళ్ళ వ్యక్తిగత, కుటుంబ సమస్య. కానీ ప్రభుత్వం పాటించాల్సిన ప్రోటోకాల్ ప్రకారం లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందాలి, కాయిన్‌ను ఆమే అందుకోవాలి.

పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే ఎన్టీయార్ కూతురు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెరవెనుక చక్రం తిప్పారట. పురందేశ్వరి ఒత్తిడి వల్లే రాష్ట్రప్రతి భవన్ లక్ష్మీపార్వతికి ఆహ్వానం పంపలేదని సమాచారం. ఇలాంటి కారణంతోనే ఎన్టీయార్‌కు భారతరత్న పురస్కారం కూడా రావటంలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. విచిత్రం ఏమిటంటే ఎన్టీయార్ బతికున్నపుడు ఆయన్ను దూరంపెట్టేసిన కుటుంబ సభ్యులందరూ కలిసి చనిపోయిన తర్వాత ఆయన గౌరవార్థం కాయన్ రిలీజ్ ప్రోగ్రామ్‌లో ఆయన పరువు తీసేస్తున్నారు. లక్ష్మీపార్వతి లేఖలకు రాష్ట్రపతి భవన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


First Published:  26 Aug 2023 5:47 AM GMT
Next Story