Telugu Global
Andhra Pradesh

ప్రేయసికి ఫోన్ చేశాడని- స్నేహితుడిని చంపేసిన వలంటీర్‌

ఇంతలోనే ఈనెల 24న మద్యం తాగుదామంటూ ఊరిబయట రైల్వే ట్రాక్‌ వద్దకు నవీన్‌ను బాలు పిలిపించాడు. అక్కడే ఇద్దరు మరోసారి గొడవపడ్డారు. ఆ సమయంలో పెద్ద కర్రతో నవీన్‌ తలపై గట్టిగా మోదాడు బాలు.

ప్రేయసికి ఫోన్ చేశాడని- స్నేహితుడిని చంపేసిన వలంటీర్‌
X

విజయనగరంలో స్నేహితుడిని హత్య చేశాడో వలంటీర్‌. తన‌ ప్రియురాలికి స్నేహితుడు ఫోన్ చేస్తున్నాడని తెలుసుకుని ఈ పనికి ఒడిగట్టాడు. హత్య కేసును ఛేదించిన తర్వాత వివరాలను డీఎస్పీ త్రినాథ్‌ మీడియాకు వెల్లడించారు. బీసీ కాలనీకి చెందిన బాలు.. డిగ్రీ పూర్తి చేసి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నవీన్ అనే స్నేహితుడు ఉండేవాడు. వలంటీర్ బాలు ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఆ అమ్మాయికి తన ఫోన్ ద్వారా కాకుండా నవీన్ ఫోన్‌తో మాట్లాడేవాడు.

ఇలా బాలు మాట్లాడి వెళ్లిన తర్వాత ఆ అమ్మాయికి నవీన్‌ కూడా ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్ బాలు.. నవీన్‌తో గొడవ పెట్టుకున్నాడు. దాంతో నవీన్‌ కూడా తిరిగి బాలును బెదిరించడం మొదలుపెట్టాడు. వలంటీర్‌గా నువ్వు చేసే పాపాలతో పోలిస్తే నేను నీ లవర్‌కు ఫోన్ చేయడం పెద్ద పాపమేమీ కాదంటూ మాట్లాడాడు. వలంటీర్‌గా ఉంటూ ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నావ్.. వలంటీర్ ముసుగులో కొందరు అమ్మాయిలు, మహిళలతో నువ్వు ఎలా ఆడుకుంటున్నావో అన్నీ బయటకు చెబుతా అంటూ నవీన్‌ బెదిరించాడు.

ఇంతలోనే ఈనెల 24న మద్యం తాగుదామంటూ ఊరిబయట రైల్వే ట్రాక్‌ వద్దకు నవీన్‌ను బాలు పిలిపించాడు. అక్కడే ఇద్దరు మరోసారి గొడవపడ్డారు. ఆ సమయంలో పెద్ద కర్రతో నవీన్‌ తలపై గట్టిగా మోదాడు బాలు. మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేసి ఊరిలోకి వెళ్లి రైలు ఢీకొట్టడంతో చనిపోయాడని నమ్మించాడు. అంత్యక్రియల విషయంలోనూ బాలు తొందరపెట్టాడు. అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అవి రైలు ఢీకొట్టడంతో తగిలిన గాయాలు కాదని నిర్దారించారు. దాంతో నవీన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి వలంటీర్‌ బాలునే ఈ హత్య చేసినట్టు తేల్చారు. విచారణలో జరిగిన విషయలన్నింటిని బాలు అంగీకరించాడు.

First Published:  28 Oct 2022 2:08 AM GMT
Next Story