Telugu Global
Andhra Pradesh

స్టీల్ ప్లాంట్ విషయంలో మమ్మల్ని శంకిస్తారా..?

ఏపీలో ప్రైవేటీకరణ ఛాంపియన్ చంద్రబాబేనని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై టీడీపీ నేతలకు పైత్యం ఎక్కువైందన్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో మమ్మల్ని శంకిస్తారా..?
X

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వ ప్రయత్నాన్ని శంకించడం తగదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడవడం తమకు ఇష్టం లేదని, అదే సమయంలో కార్మికులకు ఇబ్బంది కలగకూడదని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెంటి మెంట్ కూడా చూడాలని చెప్పారు. అందుకే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని తాము ప్రతిపాదించామని అన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా క్యాప్టివ్ మైన్స్ ప్రతిపాదన చేశారని, ఆ విషయంలో తమకు సంఘీభావం తెలిపినందుకు సంతోషించామన్నారు. అయితే హఠాత్తుగా వైజాగ్ స్టీల్స్ కోసం తెలంగాణ బిడ్ దాఖలు చేసిందని వార్తలు రావడం, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వానిది అసమర్థత అంటూ ఈనాడులో వార్తలు రావడం.. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిందని స్పష్టమవుతోందన్నారు సజ్జల.

ప్రైవేటీకరణ పితామహుడెవరు..?

ఏపీలో ప్రైవేటీకరణ ఛాంపియన్ చంద్రబాబేనని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై టీడీపీ నేతలకు పైత్యం ఎక్కువైందన్నారు. టీడీపీకి తోడు సీపీఐ, సీపీఎం నాయకులు జత కలిశారని, అసలు కమ్యూనిస్టు పార్టీ నాయకులు చంద్రబాబుకి ఎందుకు మద్దతు పలుకుతున్నాయని ప్రశ్నించారు. రామోజీరావు రాసేవన్నీ తప్పుడు వార్తలేనని, విశాఖ ప్లాంట్‌ మీద కూడా అలాగే విషపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ విచారణకోసం వెళ్తే మంచం‌మీద పడుకుని డ్రామా‌ ప్లే చేస్తున్నారని, అలా ఉండి కూడా ఇలాంటి రాతలు ఎందుకని అన్నారు.

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన ఘనత జగన్ కి దక్కుతుందన్నారు సజ్జల. అలాంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ప్రయత్నాన్ని ఎందుకు శంకిస్తున్నారని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునే అంశంపై సీఎం జగన్, కేంద్రానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేశారన్నారు. ఎవరినో మభ్య పెట్టటానికి తాము పోరాటం చేయటం లేదని, వాటి రూపాలు మారాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వ లేకపోతున్నాయని, అందుకే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

First Published:  11 April 2023 3:52 PM GMT
Next Story