Telugu Global
Andhra Pradesh

శ్రీచైతన్య కాలేజీలో దారుణం.. స్టూడెంట్‌ను కాలితో తన్నిన లెక్చ‌ర‌ర్‌

ఒక లెక్చ‌ర‌ర్‌.. విద్యార్థిని తరగతి గదిలోనే విచక్షణా రహితంగా కొట్టాడు. ఎగిరెగిరి కాలితో తన్నాడు. ఈ దృశ్యాలను వెనుక బెంచ్‌లో కూర్చున్న విద్యార్థులు రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రీచైతన్య కాలేజీలో దారుణం.. స్టూడెంట్‌ను కాలితో తన్నిన లెక్చ‌ర‌ర్‌
X

కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థుల మానసిక కుంగుబాటు కేంద్రాలుగా మారి చాలా కాలమైంది. అత్యధికంగా ఆత్మహత్యలు కూడా ఈ కార్పొరేట్‌ కాలేజీల్లోనే జరుగుతున్నాయి. అయినా అక్కడ బోధన విధానంలో మార్పులు రావడం లేదు. కేవలం మార్కులు, ర్యాంకులే తప్ప విద్యార్థులూ మనుషులే అన్న విచక్షణ కూడా ఉండడం లేదు. యాజమాన్యం నుంచి వచ్చే ఒత్తిడిని టీచర్లు అంతిమంగా విద్యార్థులపైకి నెట్టేస్తున్నారు.

తాజాగా మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక లెక్చ‌ర‌ర్‌.. విద్యార్థిని తరగతి గదిలోనే విచక్షణా రహితంగా కొట్టాడు. ఎగిరెగిరి కాలితో తన్నాడు. ఈ దృశ్యాలను వెనుక బెంచ్‌లో కూర్చున్న విద్యార్థులు రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయవాడ బెంచ్‌ సర్కిల్‌ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఈ ఘటన జరిగింది.

వీడియో వైరల్‌ కావడంతో జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు క్యాంపస్‌కు వెళ్లి విచారణ జరిపారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకా కాలేజీకి వెళ్లి జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విద్యార్థి ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని తరగతి గదిలో పాటలు వింటుంటే ఆవేశంతో కొట్టిన మాట వాస్తవమేనని లెక్చ‌ర‌ర్‌ అంగీకరించారు. విద్యార్థి మాత్రం తన దగ్గర అసలు ఇయర్‌ఫోన్సే లేవని చెబుతున్నారు. విద్యార్థిని కాలితో తన్నిన అధ్యాపకుడిని విధుల నుంచి తొలగించినట్టు కాలేజీ యాజమాన్యం అధికారులకు వివరణ ఇచ్చింది.



First Published:  17 Sep 2022 3:23 AM GMT
Next Story