Telugu Global
Andhra Pradesh

సత్యకుమార్‌పై వెంకయ్య బావమరిది సంచలన ఆరోపణలు

తనకు మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు.. పనులు చేసి పెడుతా అంటూ అడ్వాన్సులు తీసుకుని దాచుకోవడమే సత్యకుమార్ విధానమన్నారు.

సత్యకుమార్‌పై వెంకయ్య బావమరిది సంచలన ఆరోపణలు
X

ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌పై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బావమరిది భాస్కర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సత్యకుమార్ తిన్నింటివాసాలు లెక్కపెట్టే రకమని విమర్శించారు. సత్యకుమార్ పుట్టింది ప్రొద్దుటూరులో అయినా వారి తండ్రి తరఫు పూర్వీకులు మహారాష్ట్రకు చెందిన వారని, ఎప్పుడో వచ్చి ప్రొద్దుటూరులో స్థిరపడ్డారని వివరించారు.

సత్య కుమార్ బీజేపీ కాదు, ఆర్‌ఎస్‌ఎస్ కాదు.. కేవలం వెంకయ్యనాయుడు దగ్గర పీఏగానే ఎదిగారన్నారు. వెంకయ్యనాయుడు ఇతడిని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నారని, పెంచిన వారిని కూడా తుంచే రకం సత్యకుమార్ అని విమర్శించారు.

వెంకయ్య ఉప రాష్ట్రపతి అయిన తర్వాత అతడి దగ్గర ఓఎస్డీగా చేరారని.. కానీ ఒక రోజు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి తక్షణం సత్యకుమార్‌ను తొలగించాలని, అతడు ఉప రాష్ట్రపతి కార్యాలయంలో ఉండడానికి వీల్లేదని ఆదేశాలొచ్చాయ‌ని, దాంతో వెంటనే రాజీనామా చేయించారని భాస్కర్ నాయుడు వివరించారు. చేయకూడని తప్పు చేయడం వల్లనే అతడిని ఓఎస్డీ పదవి నుంచి తొలగించారన్నారు.

తనకు మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు.. పనులు చేసి పెడుతా అంటూ అడ్వాన్సులు తీసుకుని దాచుకోవడమే సత్యకుమార్ విధానమన్నారు. వెంకయ్య నాయుడుకి వారసుడిగా చెప్పుకుంటాడని, కానీ అత‌ని కులమే ఒక అబద్దం, అలాంటిది వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. తానే స్వయంగా చిన్నాన్న మనవరాలిని ఇచ్చి పెళ్లి జరిపిస్తే ఆమెను కూడా సత్యకుమార్ వేధించాడన్నారు. ఆ పెళ్లి పెటాకులైందని భాస్కర్ నాయుడు వివరించారు. కాబట్టి ఏమాత్రం మంచి వ్యక్తి కానీ సత్యకుమార్‌కు ఓటు వేయవద్దని ధ‌ర్మ‌వ‌రం ప్రజలను కోరారు.

First Published:  6 May 2024 11:16 AM GMT
Next Story