Telugu Global
Andhra Pradesh

ఇది మోదీ మరుగు దొడ్డి, బొమ్మ లేదేం.. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే..

ముందు ముందు మరుగుదొడ్లపై కూడా మోదీ బొమ్మలేదని ప్రశ్నించే రోజులొస్తాయని అంటున్నారు నెటిజన్లు. మోదీ ఫొటో కోసం కేంద్ర మంత్రులు గొడవకు దిగడం హుందాగా లేదని అంటున్నారు.

ఇది మోదీ మరుగు దొడ్డి, బొమ్మ లేదేం.. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే..
X

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ లేకపోయినా బీజేపీ నేతలు పట్టించుకోరేమో కానీ.. పథకాల పోస్టర్లపై మోదీ బొమ్మ లేకపోతే మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫొటో పెట్టాల్సిందేనంటూ రచ్చ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని రేషన్ షాపులో నిర్మలా సీతారామన్ మోదీ ఫొటో లేదని గొడవ చేస్తే, తాజాగా ఏపీలో మరో మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆస్పత్రుల్లో మోదీ ఫొటో లేదని రచ్చ చేశారు. వెంటనే మోదీ ఫొటో పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఏపీలో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించిన ఆమె అక్కడున్న ఆరోగ్యశ్రీ పోస్టర్లను చూసి షాకయ్యారు. అక్కడ పోస్టర్లపై సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ఆర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. మోదీ ఫొటో లేకపోయే సరికి అధికారుల్ని నిలదీశారు మంత్రి. కృష్ణాజిల్లాలో ఆస్పత్రుల అభివృద్ధికి కేంద్రం రూ.123కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారామె. ఆయుష్మాన్ భారత్ కూడా ఆర్థిక సాయం అందిస్తోందని.. ఆయా పథకాలపై మోదీ ఫొటో ఎందుకు లేదని అధికారుల్ని ప్రశ్నించారు. వెంటనే పోస్టర్లపై ఫొటోలు పెట్టాలన్నారు.

అక్కడ నిర్మల, ఇక్కడ భారతి..

రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీ ఫొటో లేదని కేంద్ర మంత్రులు రాద్ధాంతం చేయడం విశేషం. మొన్న రేషన్ షాపులో నిర్మలమ్మ చిందులు తొక్కితే, నిన్న ఆస్పత్రిలో మంత్రి భారతి, మోదీ ఫొటోకోసం అధికారుల్ని నిలదీశారు. దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముందు ముందు మరుగుదొడ్లపై కూడా మోదీ బొమ్మలేదని ప్రశ్నించే రోజులొస్తాయని అంటున్నారు నెటిజన్లు. మరుగుదొడ్ల విషయాన్ని ఇప్పటికే మోదీ చాలాసార్లు ఘనంగా ప్రకటించుకున్నారు. వాటన్నిటిపై మోదీ మరుగుదొడ్లు అని పోస్టర్లు వేయిస్తారా అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మోదీ ఫొటోకోసం కేంద్ర మంత్రులు గొడవకు దిగడం హుందాగా లేదని అంటున్నారు.

First Published:  12 Sep 2022 4:00 AM GMT
Next Story