Telugu Global
Andhra Pradesh

టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ర‌మ‌ణ దీక్షితులుపై వేటు

ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్య అని అన్నారు.

టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ర‌మ‌ణ దీక్షితులుపై వేటు
X

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీతోపాటు ప్ర‌భుత్వంపైన తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన తిరుమ‌ల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది. ఆయ‌న్ను టీటీడీ నుంచి తొల‌గిస్తూ సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో పాల‌క‌మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీ, రాష్ట్ర‌ ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని.. ఈ కారణంగా ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్ర‌క‌టించారు.

ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయంటూ రమణ దీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైర‌లయింది. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్య అని అన్నారు. ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని.. ఖననం చేశారని ఆయ‌న చెప్పిన‌ట్లుగా ఉన్న వీడియో సంచ‌ల‌నంగా మారింది.

అది త‌న వాయిస్ కాద‌ని లేఖ‌

అయితే ఆ వీడియోపై స్పందిస్తూ రమణ దీక్షితులు టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా.. ఈవోకీ వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. టీటీడీతో ఉన్న సంబంధాలతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆ వీడియో ఉందన్నారు. ఈ అంశంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రమణ దీక్షితులు వెల్లడించారు. అయితే ఆ వ్యాఖ్య‌లు చేసింది ర‌మ‌ణ దీక్షితులేన‌ని న‌మ్మిన టీటీడీ ఆయ‌నపై వేటు వేసింది.

First Published:  26 Feb 2024 9:22 AM GMT
Next Story