Telugu Global
Andhra Pradesh

సామాన్యుల సేవే సంతృప్తినిచ్చింది - టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చివ‌రి స‌మావేశం సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది.

సామాన్యుల సేవే సంతృప్తినిచ్చింది - టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి
X

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షునిగా తాను ప‌నిచేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు ర‌ద్దు చేయ‌డం, సామాన్యుల‌కు స్వామివారి తొలి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విఐపి బ్రేక్ స‌మ‌యాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యాలు అత్యంత సంతృప్తినిచ్చాయ‌ని టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తులకు వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాలు మెరుగుప‌ర‌చ‌డం కోసం అనేక నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, అయితే, ఈ రెండు నిర్ణ‌యాలు మాత్రం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివ‌ని తెలిపారు. నాలుగేళ్ల‌పాటు ఛైర్మ‌న్‌గా ప‌నిచేసే అదృష్టం ప్ర‌సాదించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామికి, త‌నకు అవ‌కాశం ఇచ్చిన వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి, త‌న వెన్నంటి ఉన్న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ఈవో ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఇత‌ర అధికారులు, సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నూత‌న ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అనుభ‌వం టీటీడీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చివ‌రి స‌మావేశం సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అధికారులు ఛైర్మ‌న్ నాలుగేళ్ల ప‌ద‌వీకాలంలో తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం వై.వి.సుబ్బారెడ్డి మీడియాకు బోర్డు నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. మీడియా స‌మావేశంలో తిరుప‌తి శాస‌న స‌భ్యులు, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, పోక‌ల అశోక్‌కుమార్‌, బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, మూరంశెట్టి రాములు, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి, జెఈవో వీర‌బ్ర‌హ్మం త‌దిత‌రులు పాల్గొన్నారు.

- రూ.4 కోట్లతో అలిపిరి కాలిబాట మార్గంలోని మొదటి ఘాట్‌ రోడ్డులో మోకాలిమెట్టు నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వరకు మిగిలి ఉన్న ప్రదేశంలో ఫుట్‌పాత్‌ షెల్టర్ల నిర్మాణం.

- రూ.2.20 కోట్లతో తిరుమలలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డులో విద్యుత్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు.

- రూ.2.50 కోట్లతో తిరుమ‌ల‌లోని పిఏసి-1లో అభివృద్ధి పనులు.

- రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్ల‌లో ర‌క్ష‌ణ గోడ‌ల నిర్మాణం.

- రూ.4.50 కోట్లతో శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి వినియోగించే వంట సరుకులను మరింత నాణ్యంగా పరిశోధించేందుకు వీలుగా అత్యాధునిక యంత్ర ప‌రిక‌రాలు కొనుగోలు.

- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత భక్తులు వేచి ఉండేందుకు తిరుమ‌ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త‌ర‌హాలో రూ.23.50 కోట్లతో యాత్రికుల వసతి భవనం నిర్మాణం.

- త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్‌స్పెషాలిటీ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, డ్యూటీ డాక్ట‌ర్లు, స్టాఫ్ న‌ర్సులు, ఇత‌ర పారామెడిక‌ల్ సిబ్బంది నియామ‌కానికి అనుమ‌తి. అదేవిధంగా రూ.75.86 కోట్ల‌తో అత్యాధునిక‌ వైద్య‌ప‌రిక‌రాల కొనుగోలు.

- తిరుప‌తిలోని శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌లో భ‌క్తుల స‌దుపాయం కోసం రూ.3 కోట్ల‌తో స‌బ్‌వే నిర్మాణం.

- రూ.3.10 కోట్లతో శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పార్కింగ్‌ వసతి, మినీ కల్యాణకట్ట, ఫెసిలిటీ సెంటర్‌ తదితర అభివృద్ధి పనులు.

- రూ.9.85 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో వకుళ మాత ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాల ఏర్పాటు.

- తిరుప‌తిలోని శ్రీ‌నివాస సేతుకు గాను చివ‌రి విడ‌త‌గా రూ.118.83 కోట్లను ప‌నులు పూర్తికాగానే చెల్లించ‌డానికి ఆమోదం.

- తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో అభివృద్ధి ప‌నుల‌కు రూ.5 కోట్లు మంజూరు.

- తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాల‌కు వినియోగించేందుకు ఎస్వీ గో సంర‌క్ష‌ణ‌శాల‌లో రూ.4.25 కోట్లతో సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో నెయ్యి త‌యారీ ప్లాంటు ఏర్పాటు.

- ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో రూ.11.50 కోట్లతో అదనపు అంత‌స్తు నిర్మాణం, రూ.2.60 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ అభివృద్ధి పనులు, రూ.3 కోట్లతో ఆయుర్వేద‌ కళాశాల విద్యార్థినుల హాస్టల్‌ భవనంలో అదనంగా మరో రెండు అంతస్తుల నిర్మాణం.

- రూ.2.20 కోట్లతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో నూతన టిబిసిడి వార్డు నిర్మాణం.

- రూ.11 కోట్లతో ఎస్వీ సంగీత కళాశాల, మ‌రియు ఎస్వీ నాదస్వర పాఠశాలలో చదువుతున్న బాలురకు హాస్టల్‌ భవనం నిర్మాణం.

- రూ.1.65 కోట్ల శ్రీ‌వాణి నిధుల‌తో తిరుపతిలోని పల్లెవీధిలో వెలసి ఉన్న వేశాలమ్మ ఆలయ అభివృద్ధి, శ్రీ తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయ పున‌ర్నిర్మాణం.

- రూ.1.25 కోట్లతో దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ లేని 69 టీటీడీ భూములకు కంచె నిర్మాణం.

- టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌ను మ‌రో మూడేళ్ల పాటు నియామ‌కం.

- తెలుగు రాష్ట్రాల్లో శ్రీ‌వాణి నిధుల‌తో 26 ఆల‌యాల అభివృద్ధి.

First Published:  7 Aug 2023 11:55 AM GMT
Next Story