Telugu Global
Andhra Pradesh

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఫంక్షన్ హాల్..

సీఎం జగన్ మార్గదర్శనంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి టీటీడీ ప్రత్యేక కృషి చేస్తోందని వివరించారు. ఉద్యోగులు మరింతగా భ‌క్తుల‌కు సేవ‌లు అందించాల‌ని పిలుపు నిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఫంక్షన్ హాల్..
X

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తిరుపతిలోని వినాయకనగర్ టీటీడీ క్వార్టర్స్ సముదాయంలో ఉద్యోగుల కోసం రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఫంక్షన్ హాల్ నిర్మించామని, ఇక్కడ వంటగది, వాష్ రూములు, విశాలమైన ప్రాంగణం ఉన్నాయన్నారు. ఉద్యోగులు ఈ ఫంక్షన్ హాల్ ని వినియోగించుకోవాలని సూచించారు.

20ఏళ్ల కల నెరవేరుతోంది..

టీటీడీ ఉద్యోగులు తమకు సొంత ఇంటి స్థలాలు కావాలంటూ 20 ఏళ్లుగా కోరుతున్నారని, వారి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 300 ఎకరాల ప్రాంగణంలో టీటీడీ ఉద్యోగులు నివసించే విధంగా ఇళ్ల స్థలాలు రెడీ చేస్తున్నట్టు తెలిపారు. భూమి కొనుగోలుకు అవసరమైన నిధుల్ని జిల్లా కలెక్టర్ కు చెల్లించామని చెప్పారు. భూమి చదును చేసి అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ప్లాట్లను అభివృద్ధి చేసిన తర్వాత ఉద్యోగులకు వాటిని అందించే ప్రక్రియ మొదలు పెడతామని అన్నారు వైవీ.





ఉద్యోగులకు సౌకర్యాలు..

టీటీడీ ఉద్యోగుల సంక్షేమం కోసం వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. ఉద్యోగులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు ఈహెచ్ఎస్ అమలు చేస్తున్నామన్నారు. సీఎం జగన్ మార్గదర్శనంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమానికి టీటీడీ ప్రత్యేక కృషి చేస్తోందని వివరించారు. ఉద్యోగులు మరింతగా భ‌క్తుల‌కు సేవ‌లు అందించాల‌ని పిలుపు నిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.

First Published:  27 April 2023 9:05 AM GMT
Next Story