Telugu Global
Andhra Pradesh

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి మెట్టు మూసివేత

పొగమంచు కారణంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పాపవినాశనానికి వెళ్లే దారిలో కూడా ఆంక్షలు విధించారు. తిరుమలలో వివిధ క్షేత్రాలకు వెళ్లే సమయంలో వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి మెట్టు మూసివేత
X

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో మధ్యాహ్నం వరకు పొగమంచు కమ్మేసింది. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో పొగమంచు కారణంగా రెండుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అటు తిరుమలలో కూడా పొగమంచు కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపైకి వెళ్లే వాహనాల విషయంలో పలు జాగ్రత్తలు చెబుతున్నారు టీటీడీ సిబ్బంది. ఘాట్ రోడ్లలో అక్కడక్కడ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

శ్రీవారి మెట్టు మూసివేత..

పొగమంచు కారణంగా శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పాపవినాశనానికి వెళ్లే దారిలో కూడా ఆంక్షలు విధించారు. తిరుమలలో వివిధ క్షేత్రాలకు వెళ్లే సమయంలో వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఈరోజు ఉదయం నుంచి పొగమంచు, వర్షంతో తిరుమలలో వాతావరణం ఆహ్లాదంగా మారింది. అదే సమయంలో అనుకోకుండా రద్దీ కూడా పెరిగింది.

వైకుంఠ ఏకాదశి దర్శనాలకోసం టికెట్లు..

తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకోసం తిరుపతిలో టికెట్ కౌంటర్లను ప్రారంభిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు టికెట్లు ఇస్తారు. తిరుపతి ప్రధాన బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి సత్రములు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర్లోని ఇందిరా గ్రౌండ్స్, జీవకోన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, రామానాయుడు ఉన్నత పాఠశాల, MR పల్లి Z.P. హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి సమీపంలో టికెట్లు జారీ చేస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లు తీసుకున్నవారికి మాత్రమే దర్శనం ఉంటుందని తెలిపారు అధికారులు. టోకెన్ లేని వారిని సర్వదర్శనానికి కూడా అనుమతించరు.

First Published:  15 Dec 2023 1:35 PM GMT
Next Story