Telugu Global
Andhra Pradesh

ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య - పల్నాడు జిల్లాలో దారుణం

ఈ ఘటనకు పాల్పడింది హతుడి మామ, బావమరిదే కావడం గమనార్హం. ఈ ఘటన అనంతరం హతుడి భార్యతో పాటు ఆమె తండ్రి, సోదరుడు పోలీసులకు లొంగిపోయారు.

ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య  - పల్నాడు జిల్లాలో దారుణం
X

పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనకు పాల్పడింది హతుడి మామ, బావమరిదే కావడం గమనార్హం. ఈ ఘటన అనంతరం హతుడి భార్యతో పాటు ఆమె తండ్రి, సోదరుడు పోలీసులకు లొంగిపోయారు. బుధవారం రాత్రి 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన నరేష్‌(30) మొదటి భార్యతో విభేదాల కారణంగా.. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన మాధురిని ఆరేళ్ల కిందట రెండో వివాహం చేసుకున్నాడు. భర్త వేధిస్తున్నాడని బుధవారం మధ్యాహ్నం మాధురి.. తన తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వారు మాధురి ఇంటికి వచ్చారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో అందరూ కలిసి మాట్లాడుతూ.. నరేష్, అతని తండ్రి సాంబయ్య (50), తల్లి ఆదిలక్ష్మి (47)లపై.. సుబ్బారావు, శ్రీనివాసరావు ఉన్నట్టుండి కత్తులతో దాడి చేశారు.

ఈ దాడిలో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మాధురి, ఆమె తండ్రి సుబ్బారావు, సోదరుడు శ్రీనివాసరావు ముప్పాళ్లకు వెళ్లిపోయి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఆ తర్వాత ఆ ముగ్గురిని తీసుకొని పోలీసులు కోనంకి వచ్చారు. ఒకే గదిలో ముగ్గురి మృతదేహాలూ ఉండటంతో నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే, ముగ్గురిని ఒకేసారి హత్య చేయడం వెనుక అసలు కారణమేంటని ఇంకా తెలియలేదు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడుతుందేమో వేచిచూడాలి.

First Published:  23 Nov 2023 9:36 AM GMT
Next Story