Telugu Global
Andhra Pradesh

తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం.. - మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

యార్లగడ్డ నారా లోకేష్‌ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ కూతురిని లోకేష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని తాను చంద్రబాబును అడిగానని చెప్పారు.

తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం.. - మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌
X

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆకాశమంత ఎత్తు ఎదిగారని, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. తారక్‌ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదని చెప్పారు. తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టమని యార్లగడ్డ స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

లోకేష్‌ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా యార్లగడ్డ నారా లోకేష్‌ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ కూతురిని లోకేష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని తాను చంద్రబాబును అడిగానని చెప్పారు. దీనిపై ఆయన సీరియస్‌గా స్పందిస్తూ.. ‘నాన్సెన్స్‌’ అని చంద్రబాబు తనతో అన్నారని తెలిపారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని ఆ సందర్భంగా ఆయన చెప్పారని వివరించారు. అయితే ఆ తర్వాత లోకేష్‌కి బాలకృష్ణ కూతురిని ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని ఆయన గుర్తుచేశారు.

అలాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరు..

తాను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ చెప్పారు. అలాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరని ఆయన తెలిపారు. దేశానికి ఒక ఐకాన్‌ అయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు. సీఎం జగన్‌పై పిచ్చి కేసులు పెట్టారని, లక్ష కోట్ల అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ ఒక హీరో అని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

First Published:  19 Jan 2024 7:56 AM GMT
Next Story