Telugu Global
Andhra Pradesh

యువత పట్ల వైఎస్‌ జగన్ విజ‌న్ ఇదీ..

ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్‌ 27వ తేదీన ప్రవేశపరీక్ష జరగనుంది. పాలిటెక్నిక్‌ విద్యపై చైతన్యం కలిగించడానికి సాంకేతిక విద్య, శిక్షణా మండలి బుక్‌లెట్లను, పోస్టర్లను నాగరాణి విడుదల చేశారు.

యువత పట్ల వైఎస్‌ జగన్ విజ‌న్ ఇదీ..
X

రాష్ట్రంలోని యువతను, నిరుపేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు, ఇంకా చేపడుతున్నారు. ఆయన అమలు చేస్తున్న విద్యాసంస్కరణలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇచ్చి, పేద‌ కుటుంబాలు పైకి ఎదగడానికి దోహదం చేస్తాయి. ఇది ఒక రకంగా సమాజంపై పెట్టుబడి. భవిష్యత్తులో ఫలితాలు ఇచ్చేందుకు పెట్టే పెట్టుబడి. దాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్ర‌భుత్వంపై బురద చల్లుతున్నాయి. పాలిటెక్నిక్‌ విద్యను ప్రోత్సహించడం, ఆ విద్యను అందుకోవడానికి విద్యార్థులకు తగిన సౌకర్యాలను కల్పించడం ఆయన చేస్తున్న మరో మంచిపని.

బంగారు భవిష్యత్తుకు పాలిటెక్నిక్‌ విద్య మంచి మార్గమని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ చదలవాడ నాగరాణి అనడంలో అర్థం అదే. స్వతంత్రం వచ్చేనాటికి దేశం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పారిశ్రామికంగా కూడా దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్‌ నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఐఐటీ, పాలిటెక్నిక్‌, ఐటీఐలను ప్రవేశపెట్టారు. ఐఐటీ నుంచి బయటకు వచ్చే యువత వినూత్నమైన ఆలోచనలు చేసి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తుంది. వాటిని పాలిటెక్నిక్‌ చదివిన యువత క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తెస్తుంది. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నైపుణ్యం సాధించిన శ్రామిక శక్తిని ఐటీఐలు అందిస్తాయి.. ఇదీ కాన్సెప్ట్‌. ఇందుకు అనుగుణంగా ఏయే స్థాయి విద్యార్థులు ఆయా స్థాయిలో నైపుణ్యాలు సాధించి ఉపాధి పొందడానికి వీలుగా జగన్‌ విద్యరంగంపై ఎనలేని శ్రద్ధ పెట్టారు.

ఈ విషయం తెలుసు కాబట్టే వైఎస్‌ జగన్‌ పాలిటెక్నిక్‌ వైపు విద్యార్థులు మళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్‌ 27వ తేదీన ప్రవేశపరీక్ష జరగనుంది. పాలిటెక్నిక్‌ విద్యపై చైతన్యం కలిగించడానికి సాంకేతిక విద్య, శిక్షణా మండలి బుక్‌లెట్లను, పోస్టర్లను నాగరాణి విడుదల చేశారు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ విద్యలో అడ్మిషన్లు పొందడానికి అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్‌ విద్య వల్ల కలిగే ప్రయోజనాలపై, వారికి లభించే ఉద్యోగాల‌పై, వారికి లభించే వేతనాలపై అవగాహన కల్పించే చర్యలకు పూనుకున్నారు.

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో 87 ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించి శిక్షణ ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఈ కోచింగ్‌ ఉంటుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలను ఆధునీకీకరించారు కూడా. వసతి సౌకర్యాలను కల్పించారు. విద్యార్థులకు పాలిటెక్నిక్‌ విద్య అనేది ఓ మంచి అవకాశం. ప్రైవేట్‌ సంస్థలకు కూడా అటువంటి వర్క్‌ ఫోర్స్‌ అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాలిటెక్నిక్‌ విద్యను జగన్‌ ప్రభుత్వం మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంది.

First Published:  13 Feb 2024 5:58 AM GMT
Next Story