Telugu Global
Andhra Pradesh

అమరావతి యాత్రకు బ్రేక్

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పాదయాత్రలో పాల్గొంటామని జాబితా ఇచ్చిన 600 మందిని మాత్రమే యాత్రకు అనుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

అమరావతి యాత్రకు బ్రేక్
X

అమరావతి పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పాదయాత్రలో అనుమతి ఉన్న 600 మంది మాత్రమే పాల్గొనాలని, బయటి వారు పాల్గొనడానికి వీల్లేదంటూ శుక్రవారం హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోనసీమ జిల్లా రామచంద్రాపురం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పాదయాత్రలో పాల్గొంటామని జాబితా ఇచ్చిన 600 మందిని మాత్రమే యాత్రకు అనుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఐడీ కార్డులు చూపించి యాత్రకు వెళ్లాల్సిందిగా కోరారు. అందుకు అమరావతివాదులు నిరాకరించారు. ఐడీ కార్డుల పేరుతో అడ్డుకోవడం సరికాదని వాగ్వాదానికి దిగారు.

పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని.. ఐడీకార్డులు చూపించి యాత్రలో పాల్గొంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం అడగని మీరు ఇప్పుడే ఎందుకు ఐడీ కార్డులు అడుగుతున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అమరావతివాదులకు మద్దతుగా టీడీపీ నేతలు వచ్చారు. హైకోర్టు ఆదేశాలను వంకగా చూపించి యాత్రకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.

డీఎస్పీ మాత్రం తాము పాదయాత్ర చేయవద్దు అని ఎక్కడా చెప్పలేదని.. హైకోర్టు చెప్పిన 600 మందిని మాత్రమే అనుమతి ఇస్తామని చెబుతున్నామని.. ఐడీ కార్డు చూపించి యాత్రలో పాల్గొనవచ్చన్నారు. అమరావతి వాదుల ముసుగులో సంఘవిద్రోహకశక్తులు చొరబడి అలజడి సృష్టిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాజమండ్రిలో జరిగిన ఘటన పునరావృతం కాకూడదన్నారు. ఇలా ఐడీ కార్డులు అడుగుతున్న నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.

First Published:  22 Oct 2022 6:01 AM GMT
Next Story