Telugu Global
Andhra Pradesh

`భారతిపే` అంటూ టీడీపీ ప్రచారం

ఈ ప్రచారంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. మహిళలను అవమానించిన వారెవ్వరైనా మాడి మసైపోవాల్సిందేనని వైసీపీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది.

`భారతిపే` అంటూ టీడీపీ ప్రచారం
X

ఏపీ రాజకీయాలు బజారున పడుతున్నాయి. రాజ‌కీయ పార్టీలు కుటుంబాల్లోని ఆడవారిని సైతం టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇటీవల చంద్రబాబుకు వ్యతిరేకంగా విజయవాడలో వైసీపీ వాళ్లు కొన్నిపోస్టర్లను అతికించారు. ఎన్టీఆర్‌ పట్ల గతంలో చంద్రబాబు ఎలా వ్యవహరించారన్న దానిపై.. `వీ డోంట్‌ నీడ్ ఎన్టీఆర్` అంటూ డెక్కన్ క్రానికల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క‌థ‌నాన్ని ప్రింట్ తీసి పలు ప్రాంతాల్లో అతికించారు.

అందుకు ప్రతీకారంగా టీడీపీ వారు.. జగన్‌ను కాకుండా జగన్‌ భార్య వైఎస్ భారతిని టార్గెట్ చేశారు. కర్నాటకలో అక్కడి సీఎంను విమర్శించేందుకు పేటీఎం తరహాలో పేసీఎం అంటూ పోస్టర్లు అతికించి, సీఎం 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ప్రచారం చేశారు. అదే తరహాలో ఏపీలో భారతిపే అంటూ పోస్టర్లను టీడీపీ వాళ్లు అతికించారు.

తిరిగి టీడీపీ వారే ఆ పోస్టర్లను సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో భారతి ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. లిక్కర్ పేమెంట్స్ ఆమె తీసుకుంటున్నారంటూ.. భారతిపే పోస్టర్లను తయారు చేశారు.

ఈ ప్రచారంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. మహిళలను అవమానించిన వారెవ్వరైనా మాడి మసైపోవాల్సిందేనని వైసీపీ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. దేవీ నవరాత్రుల తొలిరోజున సీఎం భార్యను ఎలాంటి సంబంధం లేని విషయంలో భారతిపే అంటూ అసత్యప్రచారం చేస్తున్న టీడీపీ నేతలకూ అదే గతి పడుతుందని వైసీపీ హెచ్చరించింది.

First Published:  27 Sep 2022 7:30 AM GMT
Next Story