Telugu Global
Andhra Pradesh

జగన్ నమ్మకం వర్సెస్ బాబు వ్యూహం.. తేలేది నేడే

ఫలితం టీడీపీకి అనుకూలంగా ఉంటే మాత్రం ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైనట్టే లెక్క. వైసీపీ ఖాతాలో 7 సీట్లు పడితే.. వైనాట్ 175 అంటూ మరోసారి వైసీపీ తొడకొట్టే అవకాశముంది.

జగన్ నమ్మకం వర్సెస్ బాబు వ్యూహం.. తేలేది నేడే
X

ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు 7

ఒక్కో అభ్యర్థికి కావాల్సిన ఓట్లు 22

ఏడుగురికి కావాల్సిన మొత్తం ఓట్లు 154

టెక్నికల్ గా వైసీపీ బలం 151+5= 156

అంటే వైసీపీ ఖాయంగా ఈ 7 సీట్లను గెలుచుకుంటుంది.

టీడీపీకి టెక్నికల్ గా ఉన్న బలం 23-4=19

సో టీడీపీ బరిలో దింపిన ఏకైక మహిళా అభ్యర్థి ఓడిపోవడం గ్యారెంటీ.

పిక్చర్ ఇంత క్లియర్ గా ఉన్నా అందరూ ఈ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ గెలుచుకోవడంతో ఆ పార్టీ జోష్ లో ఉంది. అయితే ఎమ్మెల్యే కోటా స్థానాలను వాటితో పోల్చలేం కానీ, ఇక్కడ కూడా అలాంటి మ్యాజిక్ జరుగుతుందని, తన వ్యూహం ఫలిస్తుందని చంద్రబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు.

టీడీపీని గెలిపించేది ఎవరు..?

ఓటింగ్ రహస్యంగా జరుగుతుంది రిజల్ట్ ని ముందే అంచనా వేయడం కష్టం. కానీ టీడీపీ ఇప్పుడు వైసీపీ రెబల్స్ పై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికై వేసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి దూరంగా జరిగారు. ఇటీవల కాలంలో తమ నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లను పెట్టడంతో మరికొంతమంది అలకమీద ఉన్నారు. వైసీపీకి దగ్గరైన విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కి 2024లో టికెట్ విషయంలో గట్టి హామీ లభించకపోవడంతో ఆయన కూడా అంటీ ముట్టనట్టే ఉన్నారు. ఇలాంటి వారందరి ఓట్లు టీడీపీకి పడితే కచ్చితంగా తొలి ప్రాధాన్యంతోనే ఆ పార్టీ అభ్యర్థి గట్టెక్కే అవకాశాలున్నాయి. అదీ చంద్రబాబు నమ్మకం.

జగన్ భరోసా..

వైసీపీ వాస్తవ బలం 151 సీట్లు మాత్రమే. టీడీపీ, జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమకే ఓటేస్తారనే నమ్మకంతోనే ఆ పార్టీ ఏడుగురు అభ్యర్థులను బరిలో దింపి 154 ఓట్లు తమకే గ్యారెంటీగా పడతాయని భావిస్తోంది. అదే సమయంలో తమవైపు ఉన్న అసంతృప్తుల ఓట్లు కూడా టీడీపీకి వెళ్తాయనే భయం కూడా లోలోపల వైసీపీని వేధిస్తోంది. బలం లేకపోయినా అభ్యర్థిని బరిలో దింపారంటూ టీడీపీని టార్గెట్ చేస్తున్నారు కానీ, తమ ఓట్లు తమకే గుంపగుత్తగా పడతాయనే ధైర్యం మాత్రం వైసీపీలో సన్నగిల్లుతోంది. ఈ అనుమానాలన్నీ ఈరోజే పటాపంచలవుతాయి. అసెంబ్లీలోని కమిటీ హాల్‌ - 1లో ఈరోజు ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలనుంచి కౌంటింగ్ మొదలు పెడతారు, గంటల వ్యవధిలోనే ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఎలా ఉంటుందనేదే ఇప్పుడు అందరిలో ఉన్న ఆసక్తి. ఫలితం టీడీపీకి అనుకూలంగా ఉంటే మాత్రం ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైనట్టే లెక్క. వైసీపీ ఖాతాలో 7 సీట్లు పడితే.. వైనాట్ 175 అంటూ మరోసారి వైసీపీ తొడకొట్టే అవకాశముంది.

First Published:  23 March 2023 1:02 AM GMT
Next Story