Telugu Global
Andhra Pradesh

గోల చేస్తే సైకిల్ వచ్చేస్తుందా?

చంద్రబాబు పాలన 2014-19లో జనాలు చూసిన తర్వాతే కదా 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించింది. ఈ విషయాలన్నింటినీ పక్కనపడేసి సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా?

గోల చేస్తే సైకిల్ వచ్చేస్తుందా?
X

జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కొత్త ఉద్యమం మొదలుపెట్టింది. ఈ కొత్త ఉద్యమం ట్విట్టర్ వేదికగానే లేండి. ఇంతకీ కొత్త ఉద్యమంలో మెయిన్ పాయింట్ ఏమిటంటే ‘సైకో పోవాలి..సైకిల్ రావాలి’ అని. ఒక‌ప్పుడు అంటే బైబై బాబు అని 2019 ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన నినాదానికి పోటీగా ఇపుడు సైకో పోవాలి..సైకిల్ రావాలంటు టీడీపీ నినాదం మొదలుపెట్టింది. జగన్‌ను ఒక సైకోలాగ, ప్రభుత్వాన్ని సైకో ప్రభుత్వంలాగ టీడీపీ జనాలు వర్ణించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన ఐదారు వీడియోల్లో ఎక్కువ భాగం టీడీపీ జనాలతోనే సైకో పోవాలని..సైకిల్ రావాలని చెప్పించారు. టీడీపీ జనాలు చెబితే వైసీపీ ఓడిపోతుందా? మామూలు జనాల మనోభావాలు ఎలాగున్నాయి, జగన్ ప్రభుత్వంపై జనాభిప్రాయం ఎలాగుందన్నది కీలకమైనది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం మంది ఓట్లేస్తే వ్యతిరేకించినవాళ్ళు 49 శాతం మందున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ 49 శాతం మంది ఓటర్లలోనే టీడీపీకి ఓట్లేసినవారు 38 శాతం ఉన్నారు. మళ్ళీ వీళ్ళతోనో లేకపోతే మిగిలిన 11 శాతం మందితోనో జగన్ పాలన పోవాలి..సైకిల్ పాలన రావాలని ఎంత చెప్పిస్తే మాత్రం ఏమిటి ఉపయోగం? వైసీపీ ఓడిపోతుందా? వైసీపీ ఓడిపోవాలంటే మొన్నటి ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా వేసిన 51 శాతం ఓటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఓట్లేస్తే కానీ జగన్ ఓడిపోరు. మరి ఆ 51 శాతం ఓటర్ల మనసు మార్చటానికి చంద్రబాబు ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు?

జగన్ పాలన కన్నా తాను ఏ విధంగా మెరుగైన పాలన ఇవ్వగలనో చంద్రబాబు జనాలకు చెప్ప‌గ‌లిగితేనే టీడీపీ వైపు జనాలు మొగ్గు చూపుతారు. అయితే చంద్రబాబు పాలన 2014-19లో జనాలు చూసిన తర్వాతే కదా 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించింది. ఈ విషయాలన్నింటినీ పక్కనపడేసి సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటే టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందా?

First Published:  13 Jan 2023 7:08 AM GMT
Next Story