Telugu Global
Andhra Pradesh

నా బట్టలు చించేశారు.. ప్రెస్‌మీట్లో చింతమనేని ప్రదర్శన

ఏ పోలీసులైతే అతి చేస్తున్నారో వారి సంగతిని టీడీపీ అధికారంలోకి వచ్చాక తేలుస్తామన్నారు. చొక్కాలు చించి భయపెట్టాలనుకుంటున్నారేమో.. మా వెంట్రుక కూడా తెగదు అంటూ దురుసుగా మాట్లాడారు. తన చొక్కా చింపిన డీఎస్పీ కూడా ఏమీ పీకలేరన్నారు.

నా బట్టలు చించేశారు.. ప్రెస్‌మీట్లో చింతమనేని ప్రదర్శన
X

జనవరి మూడున తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని.. వారిని అభినందించేందుకు తాను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వెళ్లగా పోలీసులు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆరోపించారు. రక్తదాన శిబిరం వద్దకు వెళ్తానని తాను పోలీసులను విజ్ఞప్తి చేశానని.. కానీ ఎలాంటి కారణం లేకుండా డీఎస్పీ అప్పటికప్పుడు వ్యాన్‌ పిలిపించి బలవంతంగా అందులోకి ఎక్కించారన్నారు. తన బట్టు చించేశారన్నారు.

తాను అదే ఆస్పత్రిలో ఉన్న హరిరామ జోగయ్యను పరామర్శించేందుకు కూడా వెళ్లలేదన్నారు. తన బట్టలను చించేశారంటూ ప్రెస్‌మీట్‌లో చినిగిన బట్టలను చింతమనేని ప్రదర్శించారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని .. డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహిస్తుంటే సహకరించాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తనపై ఇప్పటికే 31 కేసులు పెట్టారని.. తాను అన్నింటికి తెగించే పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఎవరైనా సరే ఎక్కువ చేస్తే చింతమనేనికి పట్టిన గతే మీకూ పడుతుందని మిగిలిన టీడీపీ నేతలను భయపెట్టేందుకు ఇలా తన పట్ల వ్యవహరిస్తున్నారని చింతమనేని చెప్పారు.

ఏ పోలీసులైతే అతి చేస్తున్నారో వారి సంగతిని టీడీపీ అధికారంలోకి వచ్చాక తేలుస్తామన్నారు. చొక్కాలు చించి భయపెట్టాలనుకుంటున్నారేమో.. మా వెంట్రుక కూడా తెగదు అంటూ దురుసుగా మాట్లాడారు. తన చొక్కా చింపిన డీఎస్పీ కూడా ఏమీ పీకలేరన్నారు.

First Published:  2 Jan 2023 1:28 PM GMT
Next Story