Telugu Global
Andhra Pradesh

కడప వారికి టికెట్ ఇస్తే మా వర్గం ఓడిస్తుంది- రాయపాటి

నరసరావుపేట ఎంపీ టికెట్‌ను కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్‌కు కేటాయించబోతున్నారన్న ప్రచారం నడుస్తోంది.

కడప వారికి టికెట్ ఇస్తే మా వర్గం ఓడిస్తుంది- రాయపాటి
X

కడప జిల్లా వారికి టీడీపీ నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటించారు టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. తాడికొండలో నారా లోకేష్‌ పుట్టిన రోజు కార్యక్రమాల్లో పాల్గొన్న రాయపాటి.. కడప జిల్లా వారికి టికెట్ ఇస్తే తమ వర్గం తప్పకుండా ఓడిస్తుందని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు. తన కుమారుడు, కుమార్తె పోటీ చేస్తారని చెప్పారు. వారి కోసం రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సిందిగా చంద్రబాబును కోరానన్నారు. నరసరావుపేట ఎంపీ టికెట్ కడప జిల్లా వారికి ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని చెప్పారు. తన సీటును కడప జిల్లా వారికి ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోనన్నారు.

పవన్‌ కల్యాణ్‌తో పొత్తు ఉంటే టీడీపీకే మంచిదన్నారు. భవిష్యత్తులో అధికారం తిరిగి చంద్రబాబుదేనని చెప్పారు. చంద్రబాబు అనుమతి ఇవ్వడం వల్లనే జగన్ పాదయాత్ర చేయగలిగారని రాయపాటి చెప్పారు. నారా లోకేష్ పాదయాత్రకు కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.

నరసరావుపేట ఎంపీ టికెట్‌ను కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్‌కు కేటాయించబోతున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఆయన పేరు దాదాపు ఫైనల్ అయినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా వారికి ఎంపీ టికెట్ ఇస్తే ఓడిస్తామని రాయపాటి వార్నింగ్ ఇస్తున్నారు.

First Published:  24 Jan 2023 4:03 AM GMT
Next Story