Telugu Global
Andhra Pradesh

నారా లోకేష్ హామీలకు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

ఇచ్చిన హామీల‌న్నీ ప్ర‌భుత్వం వ‌చ్చాక వివిధ శాఖ‌ల నిధుల‌తోనే చేప‌డ‌తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. పాద‌యాత్ర‌లో లోకేష్ ఇస్తున్న ప్ర‌తీ వంద కిలోమీట‌ర్ల హామీ నెర‌వేరాలంటే తెలుగుదేశం ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తేనే సాధ్యం

నారా లోకేష్ హామీలకు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి
X

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ పాద‌యాత్ర ఇప్ప‌టివ‌ర‌కూ 47 రోజులు పూర్త‌య్యింది. 600 కిలోమీట‌ర్లు దాటింది. ముందుగా ప్ర‌క‌టించిన మేర‌కు పాద‌యాత్ర 400 రోజుల‌లో 4000 కిలోమీట‌ర్లు పూర్తి చేయ‌నున్నారు. ప్ర‌తీ వంద కిలోమీట‌ర్ల‌కి ఒక హామీ ఇస్తూ, అదొక మైలురాయిగా ప్ర‌చారం చేస్తున్నారు. వంద కిలోమీట‌ర్లు పూర్త‌య్యాక‌, ఆ ప్రాంతంలో ఏదో ఒక అభివృద్ధి ప‌ని చేప‌డ‌తామ‌ని హామీ ఇస్తున్నారు లోకేష్‌. ఈ హామీల‌న్నింటికీ కింద ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌నే ట్యాగ్ లైన్ ఉంది. ఈ హామీల‌న్నీ నెర‌వేరాలంటే తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో రావాలి. టీడీపీ స‌ర్కారు ఏర్ప‌డిన వంద రోజుల్లో ఈ హామీల అమ‌లుకు కార్యాచ‌ర‌ణ ఆరంభిస్తామంటున్నారు. ఇచ్చిన హామీల‌న్నీ ప్ర‌భుత్వం వ‌చ్చాక వివిధ శాఖ‌ల నిధుల‌తోనే చేప‌డ‌తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. పాద‌యాత్ర‌లో లోకేష్ ఇస్తున్న ప్ర‌తీ వంద కిలోమీట‌ర్ల హామీ నెర‌వేరాలంటే తెలుగుదేశం ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తేనే సాధ్యం.

ఇప్ప‌టివ‌ర‌కూ లోకేష్ ఇచ్చిన హామీలు

100 కి.మీ మైలురాయి పూర్తి చేసుకున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో డ‌యాల‌సిస్ కేంద్రాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని మాట‌ ఇచ్చారు.

200 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం కత్తెరపల్లి వద్ద డిగ్రీ కళాశాలకు టీడీపీ అధికారంలోకి రాగానే అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

300 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీ పరిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి ప‌థ‌కం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

400 కి.మీ చేరుకున్నసంద‌ర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండ‌లం న‌రేంద్ర‌కుంటలో ఆధునిక వ‌స‌తుల‌తో 10 ప‌డ‌క‌ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని ప్ర‌క‌టించారు.

500 కి.మీ పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి నియోజకర్గంలోని చిన్నతిప్పసముద్రం-2 వద్ద టమాటా ప్రాసెస్ యూనిట్, కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు ప్రభుత్వం రాగానే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

600 కిలోమీట‌ర్లు పూర్త‌యిన‌ సంద‌ర్భంగా శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలో చిన్న‌య‌ల్లంప‌ల్లి వ‌ద్ద‌ టెంపుల్ టూరిజం స‌ర్క్యూట్ ఏర్పాటు చేస్తామని, టీడీపీ ప్ర‌భుత్వం రాగానే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తామని లోకేష్ ప్ర‌క‌టించారు.

మొత్తం పాద‌యాత్ర 4 వేల కిలోమీట‌ర్లు పూర్త‌యితే, 40 హామీలు ఇస్తారు. ఈ న‌ల‌భై హామీలు నెర‌వేరాలంటే త‌ప్ప‌నిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల‌ని లోకేష్ న‌ర్మ‌గ‌ర్భంగా చెప్ప‌క‌నే చెప్పారు. ఏదైనా వ‌స్తువుకి ఆఫ‌ర్లు ఇచ్చిన‌ప్పుడు పెద్ద అక్ష‌రాల‌తో ఉండి, కింద క‌నీక‌నిపించ‌ని అక్ష‌రాల‌తో ష‌ర‌తులు ఉంటారు. లోకేష్ పాద‌యాత్ర హామీలు కూడా సేమ్ ఇలాగే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

First Published:  19 March 2023 12:54 PM GMT
Next Story