Telugu Global
Andhra Pradesh

పింఛ‌న్ల పంపిణీపై ప్లేట్ తిప్పేసిన టీడీపీ.. ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల‌ని ఈసీకి విన‌తి

పింఛ‌న్ల పంపిణీకి వాలంటీర్లు వెళితే జ‌గ‌న్ త‌మ ఇంటికే పింఛ‌ను పంపిస్తున్నాడ‌ని వారికి మ‌రోసారి గుర్తు చేసిన‌ట్ల‌వుతుంద‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది.

పింఛ‌న్ల పంపిణీపై ప్లేట్ తిప్పేసిన టీడీపీ.. ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల‌ని ఈసీకి విన‌తి
X

ఐదేళ్లుగా ప్ర‌తి నెలా ఒక‌టో తేదీ తెల్లార‌క‌ముందే గ‌డ‌ప గ‌డ‌ప‌కి వ‌చ్చి పింఛ‌న్లు ఇచ్చిన వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై అవాకులు చెవాకులు పేలి, ఫిర్యాదులు చేసి, లేఖ‌లు రాసి వాటి పంపిణీని అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది. ఒక‌టో తేదీ పింఛ‌ను ఇంటికి వ‌చ్చేది రాక‌పోవ‌డంతో ల‌బ్ధిదారుల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త త‌మ‌కు ఎన్నిక‌ల్లో సెగ పెడుతుంద‌ని భ‌య‌ప‌డుతోంది. అందుకే డ్యామేజ్‌కంట్రోల్ యాక్ష‌న్‌లోకి దిగింది. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతరులకు పింఛన్లు ఇవ్వాలని, పంపిణీ ప్రక్రియ ఈనెల 5 నాటికి పూర్తి చేయాలని టీడీపీ నేతలు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

స‌చివాల‌యాల‌కు వెళ్లాల‌న్న జీవో ర‌ద్దు చేయండి

పింఛ‌న్ల పంపిణీకి వాలంటీర్లు వెళితే జ‌గ‌న్ త‌మ ఇంటికే పింఛ‌ను పంపిస్తున్నాడ‌ని వారికి మ‌రోసారి గుర్తు చేసిన‌ట్ల‌వుతుంద‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది. అందుకే వాలంటీర్ల‌ను పింఛ‌న్ల పంపిణీకి దూరంగా ఉంచాల‌ని ఈసీకి లేఖ‌లు రాసింది. దీంతో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛ‌న్లు ఇవ్వ‌ద్ద‌ని, పింఛ‌న్లు తీసుకోవ‌డానికి ల‌బ్ధిదారులే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వెళ్లాల‌ని సెర్ప్ సీఈవో ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై ఈరోజు ఉద‌యం నుంచి ల‌బ్ధిదారులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. సూర్యోద‌యానికి ముందే ఇంటికొచ్చి ఇచ్చే పింఛ‌న్ల‌ను కాద‌ని, ఇప్పుడు త‌మ‌ను మండుటెండ‌లో స‌చివాల‌యం ముందు నిల్చోబెట్టిన టీడీపీపై వారు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో స‌చివాల‌యానికి వెళ్లి పింఛ‌న్లు తీసుకోవాల‌న్న సెర్ప్ సీఈవో ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేయాల‌ని టీడీపీ సీఎస్ వ‌ద్ద డిమాండ్ చేసింది.

త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ట‌!

పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాలు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని టీడీపీ నేత వ‌ర్ల‌రామ‌య్య ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నేత‌లు సీఎస్‌ను క‌లిసి సూచించారు. పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ అధికారిక వైబ్‌సైట్లో పోస్ట్ పెట్టిన‌ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం టీడీపీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ల‌బ్ధిదార్ల‌కు విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్ప‌టికే ఈ విష‌యంలో పింఛ‌నుదార్లంతా టీడీపీ మీద చాలా మంట‌తో ఉన్నారు.

First Published:  1 April 2024 3:50 PM GMT
Next Story