Telugu Global
Andhra Pradesh

డర్టీ పిక్చర్ ని జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాల్సింది..

మద్రాస్ ఐఐటీ నివేదికనే ఫోర్జరీ చేసిన చరిత్ర వైసీపీది అని ఎద్దేవా చేశారు. డర్టీ పిక్చర్ ఎంపీని వైసీపీ నేతలు వెనుకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక తెచ్చిన తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు.

డర్టీ పిక్చర్ ని జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాల్సింది..
X

గోరంట్ల మాధవ్ వీడియోపై అధికార, ప్రతిపక్షాలు నిజనిర్థారణకోసం తెగ తాపత్రయ పడుతున్నాయి. ప్రతిపక్షం అమెరికాలోని ఓ ల్యాబ్ కి పంపించి సర్టిఫికెట్ చూపిస్తుంటే, ఆ సర్టిఫికెట్ తప్పు అంటూ తాజాగా ఏపీ సీఐడీ స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఈ సీరియల్ లో కొత్త ఎపిసోడ్ మొదలైంది. అయితే టీడీపీ దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయింది. ప్రైవేట్ ల్యాబ్స్ కి పంపించాల్సిన ఖర్మ ప్రభుత్వానికేంటని, నేరుగా జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తే నిజానిజాలు తేలిపోయేవి కదా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారంలో సీఐడీని కూడా అధికార పార్టీ వాడేసుకుంటుందంటూ మండిపడ్డారు.

స్టాఫోర్డ్ నివేదిక సరైనదే..

మాధవ్ వీడియోలో ఎడిటింగ్ లేదని జిమ్ స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక వాస్తవమేనని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. ఈ అంశంలో మరిన్ని నిజాలతో బయటకు వస్తామన్నారు. ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన స్టాఫోర్డ్ ఇచ్చిన నివేదిక తప్పు అని చెప్పడం సరికాదన్నారు. స్టాఫోర్డ్ కు తాము పంపిన ఈమెయిల్స్, ఇతర ఆధారాలు అన్నీ ఉన్నాయని పట్టాభి చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో చూపించాల్సిన చొరవ తప్పు చేసిన వారిని వెనకేసుకు రావటంలో చూపుతుండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారాయన. మద్రాస్ ఐఐటీ నివేదికనే ఫోర్జరీ చేసిన చరిత్ర వైసీపీది అని ఎద్దేవా చేశారు. డర్టీ పిక్చర్ ఎంపీని వైసీపీ నేతలు వెనుకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక తెచ్చిన తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా మాధవ్ వీడియోను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ కు పంపాలని పట్టాభి డిమాండ్ చేశారు.

డర్టీ ఎంపీని కాపాడేందుకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమ. రాష్ట్ర పరువు మంట గలిపిన ఎంపీ గోరంట్ల మాధవ్ ని వెనకేసుకొస్తున్న పోలీసులు, ప్రభుత్వం రోజుకో డ్రామా ఆడుతోందన్నారు. అసలు వీడియో సంపాదించాల్సిన బాధ్యత పోలీసులుదా లేక ప్రతిపక్షానిదా..? అని ప్రశ్నించారు. ప్రైవేటు ల్యాబ్ నివేదికను పరిగణనలోకి తీసుకోమని చెప్తూనే, కేసులు పెడతామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఎలా బెదిరిస్తారని మండిపడ్డారు. సునీల్ కుమార్ చదివింది ఐపీఎస్సా లేక వైపీఎస్సా? అని ఎద్దేవా చేశారు.

అసలు కేసు బాధ్యతలను ప్రభుత్వం సీఐడీకి ఎప్పుడు అప్పగించిందని ప్రశ్నించారు. పోలీస్ అధికారులు, ఆ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాల్సింది పోయి సొల్లు కబుర్లు చెప్పడం ఏంటని మండిపడ్డారు. మాధవ్ ది ఫేక్ వీడియో అయితే ఈపాటికే అది సృష్టించిన వారిని బూటకపు ఎన్ కౌంటర్ చేసేవాళ్ళని అన్నారు.

First Published:  19 Aug 2022 2:14 AM GMT
Next Story