Telugu Global
Andhra Pradesh

మీ తొలిఓటు మాకే.. టీడీపీ కొత్త ఎత్తుగడ

దాదాపు 45లక్షలమంది ఓటర్లు 2024లో తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరందర్నీ తమవైపు తిప్పుకోవాలనుకుంటోంది టీడీపీ. యూత్ టార్గెట్ గా ప్రచారం మొదలు పెట్టింది.

మీ తొలిఓటు మాకే.. టీడీపీ కొత్త ఎత్తుగడ
X

రైతుల మద్దతు వైసీపీకే

మహిళల మద్దతు వైసీపీకే

మైనార్టీల మద్దతు వైసీపీకే

దళితుల మద్దతు వైసీపీకే..

లబ్ధిదారులందరి మద్దతు వైసీపీకే..

ఇక మిగిలింది ఎవరు..? టీడీపీ కూటమికి పడాల్సిన ఓట్లు ఎవరివి..? మిగతా వర్గాల సంగతేమో కానీ రాష్ట్రంలో తొలి ఓటు వేసేవారిని టీడీపీ టార్గెట్ చేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 41.31 లక్షల మేర పెరిగింది. ప్రస్తుతం ఏపీలోని ఓటర్ల సంఖ్య 4.12 కోట్లు. మరణాలు, ఇతరత్రా తొలగింపులు కూడా పరిగణలోకి తీసుకుంటే కొత్తగా చేరిన ఓట్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 45లక్షలమంది ఓటర్లు 2024లో తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరందర్నీ తమవైపు తిప్పుకోవాలనుకుంటోంది టీడీపీ. యూత్ టార్గెట్ గా ఎల్లోమీడియా ద్వారా విష ప్రచారం మొదలు పెట్టింది.

జాబు రావాలంటే బాబు రావాలి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలి, ఏపీకి కంపెనీలు తరలి రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలంటూ ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. వైసీపీ హయాంలో ఫలానా ఫలానా కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారంటూ లిస్ట్ చదివి వినిపిస్తోంది. వైసీపీ వచ్చినప్పటినుంచి ఈ విష ప్రచారం ఉంది కానీ, ఎన్నికల వేళ టీడీపీ దీనిపై మరింత ఫోకస్ పెంచింది. యువత ఓట్లకు గేలం వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ అనే కార్యక్రమం చేపట్టింది.

వైసీపీ వ్యూహం ఏంటి..?

వాస్తవానికి టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలోనే ఎక్కువ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి, ఎక్కువ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. కానీ వైసీపీ ఈ విజయాలను సరిగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది. ఒకరకంగా చెప్పాలంటే ఎల్లో మీడియా నెగెటివ్ పబ్లిసిటీ ముందు పారిశ్రామకి రంగంలో వైసీపీ విజయాలు హైలైట్ కాలేదు. మరోవైపు సీఎం జగన్ ప్రచారంలో సంక్షేమ పథకాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. 58 నెలల్లో జగన్ ఎన్నిసార్లు బటన్ నొక్కారు..? ఎన్ని లక్షల కోట్లు డీబీటీ ద్వారా జమ అయ్యాయి..? అనే విషయాలపైనే పార్టీ కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దీంతో సహజంగానే పారిశ్రామిక రంగ ప్రగతి మరుగునపడిపోయింది.

ఇప్పుడేం చేయాలి..?

మహిళలు, రైతులు, ఇతర వర్గాల వారు వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నా కూడా యువత ఓటింగ్ కూడా కీలకం. వైసీపీ హయాంలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, కంపెనీల ఏర్పాటు, ఒప్పందాలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల గురించి యువతకు సరైన సమాచారం అందించాలి. టీడీపీ విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. అలా చేస్తేనే ఆ 45 లక్షల తొలి ఓట్లను వైసీపీ ఆకర్షించగలదు. లేకపోతే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్నే యువత నమ్మే ప్రమాదం ఉంది.

First Published:  7 April 2024 11:25 AM GMT
Next Story