Telugu Global
Andhra Pradesh

తొందరలోనే చంద్రబాబు పల్లెనిద్ర

గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా ఉందని పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు పల్లెనిద్రకు రెడీ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించటం ద్వారా ప్రభుత్వ అరాచకాలు, దుర్మార్గాలను ప్రజలకు వివరించటమే ఉద్దేశం.

తొందరలోనే చంద్రబాబు పల్లెనిద్ర
X

ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తొందరలోనే పల్లెనిద్రకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచి ఎలాగైనా అందరితో ఓట్లు వేయించుకోవాలన్నదే ఏకైక టార్గెట్‌గా చంద్రబాబు ఇప్పటికే అనేక ప్రోగ్రాములు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు మహిళాశక్తి పేరుతో పార్టీలోని మహిళా నేతలతో 50 రోజుల కార్యక్రమాలను ప్రారంభించారు. వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలపైనే ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఈ మధ్యనే చంద్రబాబు ప్రకటించిన మినీ మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మహిళలకు ప్రకటించిన వరాలను వివరించటమే మహిళా నేతల టూర్ ఉద్దేశం.

ఇదే సమయంలో పార్టీలోని నేతలను ఐదు బృందాలుగా ఏర్పాటుచేసి రాష్ట్రంలోని 125 నియోజకవర్గాల్లో బస్సులో పర్యటించేట్లుగా ప్లాన్ చేశారు. చంద్రబాబు గతంలోనే నగరాలు, పట్టణాల్లో రోడ్డుషోలు నిర్వహించారు. ఇదే సమయంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వీటన్నింకీ అదనంగా చంద్రబాబు తొందరలోనే పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా ఉందని పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు పల్లెనిద్రకు రెడీ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించటం ద్వారా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాలను ప్రజలకు వివరించటమే ఉద్దేశం. నిత్యావసరాల ధరల పెరుగుదల, ఎస్సీ, బీసీ సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు చేస్తున్న దాడులు, భూముల ఆక్రమణలు, మహిళలపై జరుగుతున్న దాడులను వివరించటమే చంద్రబాబు టార్గెట్.

పనిలోపనిగా టీడీపీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీని జనాల్లో పాజిటివ్‌గా తీసుకెళ్ళబోతున్నారు. రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మొదటి విడత మ్యానిఫెస్టోపై జనాల్లో పాజిటివ్‌గా చర్చలు జరిగేట్లుగా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను పల్లెనిద్ర మొదలుపెట్టగానే మిగిలిన గ్రామాల్లో టీడీపీ నేతలు కూడా పాల్గొనేట్లుగా ప్లాన్ చేస్తున్నారు. తమ్ముళ్ళందరినీ ఏకకాలంలో పల్లెనిద్రలో పాల్గొనేట్లు చేయాలని చంద్రబాబు పెద్ద ప్లాన్ వేశారు. మరి చంద్రబాబు పల్లెనిద్ర కార్యక్రమం సక్సెస్ అవుతుందా?

First Published:  16 July 2023 9:30 AM GMT
Next Story