Telugu Global
Andhra Pradesh

టీడీపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే ఫోటోపై టీడీపీ ప్రచారం

అమెరికా పర్యటనలో టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ దిగిన ఫోటోను టీడీపీ వారు వైరల్ చేస్తున్నారు.

టీడీపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే ఫోటోపై టీడీపీ ప్రచారం
X

అమెరికా పర్యటనలో టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ దిగిన ఫోటోను టీడీపీ వారు వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటో ఆధారంగా వసంత కృష్ణప్రసాద్‌ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఫోటోను శుక్రవారం బాగా ప్రచారం చేశారు. అయితే ఇది పాత ఫోటో అని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వసంతప్రసాద్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎంపీ అరవింద్ కూడా యూఎస్ వెళ్లారు. అక్కడ అందరూ ఒక కార్యక్రమంలో కలిశారు. ఆ సమయంలో దిగిన ఫోటోను ఆధారంగా చేసుకుని వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలతో భేటీ అయ్యారంటూ ప్రతిపక్షం ప్రచారం మొదలుపెట్టింది.

దీనికి వైసీపీ నుంచి గట్టి సమాధానమే వస్తోంది. వసంత కుమార్‌ టీడీపీలో చేరడం కాదు.. లోకేష్ మీద అసంతృప్తితో ఉన్న బుచ్చయ్యచౌదరే పార్టీ మారేందుకు చర్చలు జరిపారేమో చూసుకోండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఒక బీజేపీ నేత ఇంట్లో ఎంపీ కేశినేని నాని పూజలు కూడా చేశారని కాబట్టి ఆయన కూడా బీజేపీలో చేరిపోతున్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ తీరు చూస్తుంటే రాజకీయాల్లో ఉన్నాక శత్రువుగానే బతకాలి, ఎక్కడైనా కలిస్తే వేర్వేరు పార్టీల్లో ఉన్న వారు కనీసం పలకరించుకోవడం కూడా నేరమే అన్నట్టుగా ఉందని వైసీపీ విమర్శిస్తోంది.

First Published:  17 Sep 2022 4:44 AM GMT
Next Story