Telugu Global
Andhra Pradesh

దొంగఓట్లలో కూడా ప్రొఫెషనల్ టచ్చా..?

తెలంగాణలో ఓటర్ల నమోదుకు, రద్దుకు టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిబిరాలే నడుస్తున్నాయట. కూకట్ పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట లాంటి ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తోందని వైసీపీ గోలచేస్తోంది.

దొంగఓట్లలో కూడా ప్రొఫెషనల్ టచ్చా..?
X

తెలుగుదేశం పార్టీ ఏమిచేసినా అందులో కచ్చితంగా ప్రొఫెషనల్ టచ్ ఉంటుంది. పార్టీ తరఫున మహానాడు లాంటి ఈవెంట్ నిర్వహించినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసినా, మీడియా సమావేశాలు నిర్వహించినా, రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ ఇలా ఏదిచేసినా ప్రొఫెషనల్ టచ్ కనబడుతుంది. అధికారంలో ఉంటే మీడియా బలంతో బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అదే ప్రతిపక్షంలో ఉంటూ తాను చేస్తున్న పనినే అధికారపక్షం చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తూ బురదచల్లేస్తుంటుంది.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. దొంగఓట్లను చేర్పించటంలో టీడీపీ అనుసరిస్తున్న విధానాలు బయటపడ్డాయి కాబట్టే. దొంగఓట్లను చేర్పించటం అన్నది ప్రతి పార్టీ చేస్తూనే ఉంటుంది. దొంగఓట్లను చేర్పించుకోవటమే కాకుండా ఓట్లరూపంలో మలుచుకుంటుందో అప్పుడే ఆ పార్టీ లబ్దిపొందగలుగుతుంది. ఈ విషయంలో టీడీపీ ఆరితేరిపోయింది. మొన్నటివరకు దొంగఓట్లు చేర్పించటంలో, ఓట్లు వేయించుకోవటంలో టీడీపీకి ఎదురేలేదు. అయితే కొంతకాలంగా వైసీపీ తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తోంది. అందుకనే దొంగఓట్ల మీద ఇంత రచ్చ జరుగుతోంది.

తెలంగాణ-ఏపీ రెండుచోట్లా భారీగా డబుల్ ఓట్లను చేర్పించినట్లుగా వైసీపీ ఆరోపిస్తోంది. సుమారుగా 5 లక్షల ఓట్లను చేర్పించిందట. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్ళతో రాబోయే ఏపీ ఎన్నికల్లో ఓట్లేయించేందుకు పార్టీ రెడీగా ఉందని సమాచారం. వాళ్ళతో టచ్ లో ఉంటూ పోలింగుకు ముందే అందరినీ ఏపీకి రప్పిస్తుంది. అవసరమైతే ట్రాన్స్ పోర్టు కూడా ఏర్పాటు చేస్తుంది. డబుల్ ఓట్లు కాకుండా 40 లక్షల దొంగఓట్లను ఏపీలో మాత్రమే చేర్పించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో ఓటర్ల నమోదుకు, రద్దుకు టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిబిరాలే నడుస్తున్నాయట. కూకట్ పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట లాంటి ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తోందని వైసీపీ గోలచేస్తోంది. టీడీపీ దొంగఓట్ల వ్యవహారాన్ని బట్టబయలు చేయటానికి వైసీపీ నేతల తలప్రాణం తోకకువచ్చిందని సమాచారం. ఏదేమైనా తెలుగుదేశంపార్టీ వ్యవహారాలు మొత్తం మయసభను తలపిస్తుంటాయి. ఆ పార్టీలో ఉన్నదేమిటో తెలియదు, లేనిదేమిటో అర్థంకాదు. వైసీపీ కూడా దొంగఓట్లను చేర్పిస్తోందనే టీడీపీ ఆరోపణలు నిజమే కావచ్చు. అయితే ఏదో రొడ్డకొట్టుడులాగుంటుందే కానీ, టీడీపీలా మరీ ప్రొషెషనల్ టచ్ తో అయితే ఉండదని కచ్చితంగా చెప్పవ‌చ్చు.

First Published:  19 Dec 2023 7:35 AM GMT
Next Story