Telugu Global
Andhra Pradesh

లోకేష్ ని అరెస్ట్ చేస్తారా..? పోలీస్ నోటీసులు దేనికి సంకేతం..?

నోటీసుల్లో పేర్కొన్న అంశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాదయాత్ర, యువగళం కార్యక్రమం పోలీసు నిబంధనలకు లోబడే జరగాలన్నారు.

లోకేష్ ని అరెస్ట్ చేస్తారా..? పోలీస్ నోటీసులు దేనికి సంకేతం..?
X

నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కాస్త గందరగోళం చెలరేగినా ఆ తర్వాత ప్రశాంతంగానే కొనసాగుతోంది. అప్పట్లో లోకేష్ స్టూల్ ఎక్కి ప్రసంగించేవారు, నా మైక్ పోలీసులు లాక్కున్నారు అని ఆరోపించేవారు. అడపా దడపా అక్కడక్కడా నిరసనలు చెలరేగినా యాత్ర మాత్రం ఆగలేదు. కానీ ఇప్పుడు లోకేష్ ని, పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. అనంతపురం జిల్లా పోలీసులు ఇచ్చిన నోటీసులే ఇందుకు సాక్ష్యం అంటున్నారు.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. అయితే యాత్ర తాడిపత్రిలోకి ప్రవేశించే క్రమంలో యాడికి మండల పోలీసులు లోకేష్ కి నోటీసులిచ్చారు. సీఆర్పీసీ 149కింద ఈ నోటీసులు జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఈ నోటీసుల ద్వారా పోలీసులు సూచించారు. తాడిపత్రి ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న సున్నిత ప్రాంతం అని, ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్టేనని నోటీసుల్లో పేర్కొన్నారు. విధ్వంసానికి దారి తీసే ఏ పని చేయకూడదని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి మెటిరియల్ పంపిణీ చేయొద్దన్నారు.





అయితే లోకేష్‌ కు నోటీసులు ఇచ్చేందుకు తాడిపత్రి డీఎస్పీ వెళ్లగా, ఆయన వాటిని తీసుకోడానికి నిరాకరించారని అంటున్నారు. ఈ క్రమంలో యాడికి టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడికి పోలీసులు నోటీసులు అందజేశారు. నోటీసుల్లో పేర్కొన్న అంశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాదయాత్ర, యువగళం కార్యక్రమం పోలీసు నిబంధనలకు లోబడే జరగాలన్నారు. పోలీసు నోటీసులతో యాత్రను అడ్డుకోలేరంటున్నారు టీడీపీ నేతలు. లోకేష్ ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుగా నోటీసులిచ్చారని చెబుతున్నారు.

First Published:  11 April 2023 9:58 AM GMT
Next Story