Telugu Global
Andhra Pradesh

సుప్రీం తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు -చంద్రబాబు

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికల్లో గెలిచినంత హడావిడి చేస్తోంది టీడీపీ. చంద్రబాబు కూడా ట్విట్టర్లో హంగామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారాయన.

చంద్రబాబు
X

చంద్రబాబు

కందుకూరు, గుంటూరు దుర్ఘటనల తర్వాత వైసీపీ విమర్శలు కాచుకోలేక ఇబ్బంది పడుతున్న టీడీపీ ఈరోజు సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. జీవో నెంబర్-1 సస్పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికల్లో గెలిచినంత హడావిడి చేస్తోంది టీడీపీ. చంద్రబాబు కూడా ట్విట్టర్లో హంగామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారాయన.

"జీవో నెం.1 పై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు. జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే... సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సైకో తరహా నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ప్రజల ధనాన్ని వృధా చేస్తోంది. జీవో-1ను వెనక్కి తీసుకోవాలి." అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు ట్వీట్ తర్వాత టీడీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలిచిందని అన్నారు.


రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించిన అనుమతులపై ఏపీ ప్రభుత్వం జీవో నెం.1 తీసుకువచ్చింది. ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఈ నెల 23 వరకు ఆ జీవోని సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే ఈలోగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ఈరోజు తేల్చి చెప్పింది. దీంతో టీడీపీ హంగామా మొదలు పెట్టింది. వైసీపీ నుంచి మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై ఇంకా స్పందన రాలేదు. జీవో రద్దు విషయంలో ఏపీ హైకోర్టు తుదితీర్పు ఇవ్వాల్సి ఉంది.

First Published:  20 Jan 2023 1:13 PM GMT
Next Story