Telugu Global
Andhra Pradesh

రఘురామ పిటీషన్‌పై సుప్రీంకోర్టు సెటైర్

విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కూడా వెంటనే బెయిల్ రద్దు చేయాలా అని అడగటంలోని శ్లేషార్థం ఏమిటో లాయర్‌కు అర్థ‌మయ్యే ఉంటుంది. మరి జనవరి మొదటివారంలో జరగబోయే విచారణలో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

రఘురామ పిటీషన్‌పై సుప్రీంకోర్టు సెటైర్
X

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌పై సుప్రీంకోర్టు సెటైర్ వేసింది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఎంపీ తరపున లాయర్ బాలాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై పదేళ్ళుగా బయటే ఉన్నారని కాబట్టి బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు.

దీనికి స్పందించిన సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడే జగన్ బెయిల్ రద్దు చేయమంటారా అని అడిగింది. సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న లాయర్‌కు ముందు అర్థంకాలేదు. అయితే వెంటనే తేరుకుని ఇప్పటికిప్పుడు కాదని ముందు నోటీసులు ఇచ్చి తర్వాత ప్రక్రియ చేపట్టాలని కోరారు. దాంతో జగన్‌తో పాటు సంబంధించిన వారందరికీ నోటీసులు ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలాజీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్‌కు బెయిల్ ఇవ్వటాన్ని సీబీఐ వ్యతిరేకించలేదని చెప్పారు.

ఇక్కడే గతంలో రఘురామకు హైకోర్టు వేసిన ప్రశ్నలు అందరికీ గుర్తుకొస్తున్నాయి. ఇదే పిటీషన్‌ను ముందు రఘురామ హైకోర్టులో వేస్తే కొట్టేసింది. జగన్ కేసులతో ఉన్న సంబంధం ఏమిటని రఘురామను హైకోర్టు నిలదీసింది. రాజకీయ కక్ష తప్ప ఎంపీ పిటీషన్‌లో ప్రజా ప్రయోజనం ఏముందని నిలదీసింది. బెయిల్ వ్యతిరేకించటంలో సీబీఐకి లేని బాధ ఎంపీకి ఎందుకుని అడిగింది. దానికి రఘురామ లాయర్ ఎలాంటి సమాధానాలు ఇవ్వలేకపోయారు. అందుకనే పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

అయితే జగన్ అంటే నిలువెల్లా మంటతో రగిలిపోతున్న రఘురామ అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టులో మళ్ళీ ఇదే పిటీషన్ వేశారు. విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కూడా వెంటనే బెయిల్ రద్దు చేయాలా అని అడగటంలోని శ్లేషార్థం ఏమిటో లాయర్‌కు అర్థ‌మయ్యే ఉంటుంది. మరి జనవరి మొదటివారంలో జరగబోయే విచారణలో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. జగన్ అండ్ కోకు రొటీన్‌గా ఇచ్చే నోటీసులనే ఎల్లో మీడియా ‘బెయిల్ రద్దుపై విచారణ..జగన్‌కు షాక్’ అని హైలైట్ చేయటమే చాలా విచిత్రంగా ఉంది.

First Published:  25 Nov 2023 4:32 AM GMT
Next Story