Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఆధ్వర్యంలో మరో యాత్ర

త్వ‌ర‌లో చేయబోయే యాత్ర ఏమిటంటే విశాఖపట్నం టు పోలవరం ప్రాజెక్ట్ అట‌. తమ హయాంలో 70 శాతం పూర్తియిన ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసేసిందని జనాలకు వివరించటానికే పాదయాత్ర చేయబోతున్నట్లు సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు.

టీడీపీ ఆధ్వర్యంలో మరో యాత్ర
X

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర మొదలవ్వబోతోంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నది కదా. అందుకనే ఆ ఉత్సాహంలో పాదయాత్ర చేయాలని డిసైడ్ చేసింది. త్వ‌ర‌లో చేయబోయే యాత్ర ఏమిటంటే విశాఖపట్నం టు పోలవరం ప్రాజెక్ట్ అట‌. తమ హయాంలో 70 శాతం పూర్తియిన ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసేసిందని జనాలకు వివరించటానికే పాదయాత్ర చేయబోతున్నట్లు సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు.

రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ప్రాజెక్టును తమ హయాంలో చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చి పనులు చకచకా చేయించారట. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏ పనులు చేయలేదట. మొత్తానికి ప్రాజెక్టు పనులను పడకేయించేశారని బండారు మండిపోయారు. కాబట్టి జగన్ చేతకానితనాన్ని జనాలందరికి వివరించటానికే తాము పాదయాత్ర చేయబోతున్నట్లు సెలవిచ్చారు. ఇక్కడ చంద్రబాబు, జగన్ మధ్య ఒక తేడా ఉంది. అదేమిటంటే గోరంత పని జరిగినా దానికి కొండంత ప్రచారం చేసుకోవటం చంద్రబాబు గొప్పతనం.

ఇదే సమయంలో జరుగుతున్న పనులను కూడా ప్రచారం చేసుకోలేకపోవటం జగన్ చేతకానితనం. ఈ కారణంగానే చంద్రబాబు అప్పట్లో పోలవరం ప్రాజెక్టు పనులు బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయంటు ఊదరగొట్టించారు. నిజానికి ప్రాజెక్టు అసలు పనులను ముట్టుకోకుండానే కేవలం కాంట్రాక్టర్లకు డబ్బులు అందే పనులు.. అంటే పట్టిసీమ నిర్మాణం, శాండ్ పనులు లాంటివి చేపట్టారు. దీంతో కాంట్రాక్టర్లు లాభపడ్డారు. అందుకనే నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా ఉపయోగించుకున్నట్లు ఆరోపించారు.

ప్రాజెక్టులో ఎంతో కీలకమైన పునరావాస చర్యలను చంద్రబాబు ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదంటే నిర్వాసితులకు డబ్బులు చెల్లించేందుకు డబ్బులు లేవు కాబట్టి. ఈ పని జరగనిదే ప్రాజెక్టు నిర్మాణమైనట్లు కాదు. ఈ విషయాన్ని తప్ప చంద్రబాబు అండ్ కో మిగిలినవన్నీ మాట్లాడతారు. అసలు కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తన చేతుల్లోకి బలవంతంగా తీసుకున్నారని అడిగితే సమాధానం ఉండదు. వరదలకు కొట్టుకుని పోయేట్లుగా డయాఫ్రం వాల్ ఎందుకు నాసిరకంగా కట్టారంటే జవాబు చెప్పారు. ఇంతోటిదానికి మళ్ళీ విశాఖ టు పోలవరం పాదయాత్రట.

First Published:  26 March 2023 6:55 AM GMT
Next Story