Telugu Global
Andhra Pradesh

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం..

ప్రమాదం జరిగిన సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఈ కారులోని సుభాష్‌ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తె ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం..
X

రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక కారు టైరు పేలడంతో అదుపుతప్పి.. డివైడర్‌ను దాటుకొని మరీ.. ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ కారు దేవరపల్లి మండలం జాతీయ రహదారి బంధపురం వద్దకు రాగానే టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుంటూ రోడ్డు అవతలి వైపునకు వెళ్లి.. ఎదురుగా వస్తున్న మరో కారును శరవేగంగా ఢీకొట్టింది. ఆ కారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఈ కారులోని సుభాష్‌ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తె ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. రెండు కార్లలోనూ కలిపి 11 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు.

First Published:  3 Jan 2024 2:10 AM GMT
Next Story