Telugu Global
Andhra Pradesh

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యల లోగుట్టు బట్టబయలు

చంద్రబాబుతో జరిగిన ప్రశాంత్‌ కిశోర్‌ సమావేశంలో టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ, నారా లోకేష్‌ సన్నిహితుడు కిలారి రాజేశ్‌ కూడా పాల్గొన్నారు.

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యల లోగుట్టు బట్టబయలు
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యల లోగుట్టు బట్టబయలు అయింది. ఆదివారం సాయంత్ర ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన సదస్సులో ఆ వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ మర్నాడు సోమవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. దీన్నిబట్టే ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యల వెనక చంద్రబాబు ఉన్నారని తేటతెల్లమైంది.

చంద్రబాబుతో జరిగిన ప్రశాంత్‌ కిశోర్‌ సమావేశంలో టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ, నారా లోకేష్‌ సన్నిహితుడు కిలారి రాజేశ్‌ కూడా పాల్గొన్నారు. రాబిన్‌ శర్మ గతంతో ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌లో పనిచేసినవారే. ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. జగన్‌ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

గతంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లి ప్రశాంత్‌ కిశోర్‌ చంద్రబాబుతో సమావేశమైన విషయం తెలిసిందే. బిజెపిలోని చంద్రబాబు సన్నిహితుడు సిఎం రమేష్‌ సమకూర్చిన ప్రత్యేక విమానంలో నారా లోకేష్‌తో కలిసి ప్రశాంత్‌ కిశోర్‌ విజయవాడ వెళ్లారు. ఇదంతా చూస్తుంటే, ప్రశాంత్‌ కిశోర్‌ సాయాన్ని అప్పటి నుంచే చంద్రబాబు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ప్రశాంత్‌ కిశోర్‌ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని తెలిసిపోతోంది.

First Published:  5 March 2024 11:32 AM GMT
Next Story