Telugu Global
Andhra Pradesh

మేం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

మేం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు సజ్జల. దాడులు వాళ్లే చేస్తున్నారని, బాధితులు కూడా వాళ్లే అన్నట్టుగా తిరిగి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.

మేం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?
X

వైసీపీ వాళ్ల మౌనాన్ని అలుసుగా తీసుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దణ్ణం పెట్టి చెబుతున్నాం.. హత్యలు, దాడులకు దూరంగా ఉండండి.. అని టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారాయన. వారు చేస్తున్న దాడులకు తమ రియాక్షన్ వేరేలా ఉంటే తట్టుకోలేరని హెచ్చరించారు. టీడీపీ దాడిలో చనిపోయిన మేకా వెంకటరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సజ్జల.. ప్రతిపక్షాలు హింసాత్మక రాజకీయాలకు తెగబడుతున్నాయని అన్నారు. టీడీపీ గూండాలు రెచ్చగొట్టి మరీ బైక్ తో వచ్చి మేకా వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, ప్రాణాలు తీయాలన్న ఉద్దేశంతోనే ఇలా దాడులకు దిగుతున్నారని అన్నారు. తామంతా సంయమనంతో, నిగ్రహంతో ఉన్నా కూడా టీడీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు సజ్జల.


మేం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు సజ్జల. దాడులు వాళ్లే చేస్తున్నారని, బాధితులు కూడా వాళ్లే అన్నట్టుగా తిరిగి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు సజ్జల. తమ వాళ్లు నిగ్రహంతో ఉన్నారు.. కాబట్టే టీడీపీ నేతలు ఇంకా ఉన్నారని చెప్పారు. శవాలపై పేలాలు ఏరుకోవాలని టీడీపీ చూస్తోందని, సీఎం జగన్‌పై జరిగిన దాడి మరచిపోక ముందే మరో హత్యకు పాల్పడ్డారని అన్నారు. వైసీపీ నేతల మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దన్నారు. సిగ్గు లేకుండా జరిగిన దాడులను వెనకేసుకొచ్చి డ్రామాలని అనడం మరింత పైశాచికత్వం అని అన్నారు సజ్జల.

రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ 20 రోజుల్లో వదులుతుందన్నారు సజ్జల. తాము కూడా వారిలాగే రెచ్చిపోతే ఆ పరిస్థితులు ఎక్కడికో దారితీస్తాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో టీడీపీ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని, వైసీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం కోల్పోవద్దని సూచించారు. న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటామన్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సజ్జల.

First Published:  20 April 2024 3:03 PM GMT
Next Story