Telugu Global
Andhra Pradesh

అమూల్‌ పాలపై రామోజీరావు విషం.. ఎందుకీ అబద్ధాలు?

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ప్రైవేట్‌ డెయిరీలు మూతపడ్డాయి. అదే విధంగా యుహెచ్‌టీ, పౌడర్‌ ప్లాంట్లు, ఎంసీసీతో పాటు 141 బిఎంసీయూలను మూసేశారు.

అమూల్‌ పాలపై రామోజీరావు విషం.. ఎందుకీ అబద్ధాలు?
X

రామోజీరావు తన ఈనాడు ప‌త్రిక‌ ద్వారా పాడి రైతుల పాలల్లో అబద్దపు విషం చిమ్ముతున్నారు. ‘రైతుల కష్టాలు.. అమూల్‌ పాలు’ అంటూ అవాస్తవాలతో ఈనాడులో వార్తాకథనాన్ని నింపేశారు. అమూల్‌ రాకతో ఏడుసార్లు పాల సేకరణ ధరలు పెరిగాయనే వాస్తవాన్ని ఆయన గమనించడం లేదు. దీనివల్ల ఇతర పాల డెయిరీలు కూడా రైతులకు అదే ధర చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాడి రైతులకు అదనంగా రూ.4,818 కోట్ల ప్రయోజనం చేకూరింది.

దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రంలోని ప్రైవేట్‌ డెయిరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా అమూల్‌ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలను సేక‌రిస్తోంది. ఈ విషయాన్ని విస్మరించి రామోజీరావు అమూల్‌పై విషం చిమ్మారు.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ప్రైవేట్‌ డెయిరీలు మూతపడ్డాయి. అదే విధంగా యుహెచ్‌టీ, పౌడర్‌ ప్లాంట్లు, ఎంసీసీతో పాటు 141 బిఎంసీయూలను మూసేశారు. మూతపడిన డెయిరీలను పునరుద్ధరించేందుకు జగన్‌ ప్రభుత్వం నడుం బిగించింది.

చిత్తూరు డెయిరీ...

లిక్విడేషన్‌లో ఉన్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం జగన్‌ ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. డెయిరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్‌కు లీజుకు ఇచ్చింది. వాటి ఆస్తులు, భూములపై ఏ విధమైన హక్కులు కల్పించలేదు. ఈ ప్రాజెక్టు కోసం అమూల్‌ రూ.385 కోట్లు ఖర్చు చేస్తోంది. చిత్తూరు డెయిరీకి చెందిన రూ.182 కోట్ల అప్పులు తీర్చి అప్పగించారంటూ చేసిన ఆరోపణల్లో ఇసుమంత వాస్తవం కూడా లేదు. ఈ బకాయిలన్నీ చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచీ ఉన్నవే. వాటిని జగన్‌ ప్రభుత్వం క్లియర్‌ చేసిందే తప్ప అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు చెల్లించలేదు.

ఒంగోలు డెయిరీ...

ఒంగోలు డెయిరీని మళ్లీ వినియోగంలోకి తేవాలన్న సంకల్పంతో అమూల్‌కు లీజుకు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు అమూల్‌ ముందుకు వచ్చింది. అలాంటి పరిస్థితిలో రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులను అప్పగిస్తున్నారని ఈనాడు అబద్ధాల చిట్టా విప్పింది.

First Published:  2 March 2024 7:01 AM GMT
Next Story