Telugu Global
Andhra Pradesh

కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు చంద్రబాబు కానుకలు..

కుక్కలకు బిస్కెట్లు విసిరేసినట్టు, మేకలకు దాణా వేసినట్టు.. అందర్నీ ఒకేచోటకు చేర్చి చంద్రన్న కానుకలు ఇవ్వాలనుకోవడం, వాటికోసం జనం ఎగబడేట్టు చేసి ఫొటోలు దిగడం దారుణం అని అన్నారు.

కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు చంద్రబాబు కానుకలు..
X

ఎంతమంది ప్రజలు చనిపోతే తనకు అంత పాపులార్టీ వస్తుందని చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి ప్రజలు గుమికూడినచోట తొక్కిసలాట జరుగుతుందని తెలియదా అని మండిపడ్డారు. మనుషుల ప్రాణాలకంటే చంద్రబాబుకి ఆయన పాపులార్టీయే ముఖ్యం అని విమర్శించారు. అందుకే ఇలాంటి హీనమైన పనులకు దిగజారారని దుయ్యబట్టారు.

కందుకూరు ఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదం అనుకున్నా, గుంటూరు విషయంలో మాత్రం ముమ్మాటికీ చంద్రబాబుదే తప్పు అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నారై ఎవరో కార్యక్రమం పెట్టారు, చంద్రబాబు వెళ్లిన తర్వాత ప్రమాదం జరిగింది అని తప్పించుకోవాలని చూడటం మరీ దుర్మార్గం అని అన్నారు. కుక్కలకు బిస్కెట్లు విసిరేసినట్టు, మేకలకు దాణా వేసినట్టు.. అందర్నీ ఒకేచోటకు చేర్చి చంద్రన్న కానుకలు ఇవ్వాలనుకోవడం, వాటికోసం జనం ఎగబడేట్టు చేసి ఫొటోలు దిగడం దారుణం అని అన్నారు. జనం తక్కువగా వచ్చినా ఫొటోలకు ఇబ్బంది లేకుండా ఇరుకిరుకు ప్రాంతాల్లో సభలు, కార్యక్రమాలు పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు చేశారన్నారు.


ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం..

ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం అని తీవ్రంగా విమర్శించారు ఆర్జీవీ. పర్సనల్‌ ఇగో, పర్సనల్‌ గెయిన్‌ తప్ప ప్రజలంటే ఆయనకు లెక్కలేదన్నారు. రాజకీయ నాయకులకు ప్రజల ప్రాణాలే ముఖ్యం కావాలన్నారు. కానీ వారి ప్రాణాలే పణంగా పెట్టి, వారి ప్రాణాలను తీసి పాపులార్టీ పెంచుకోవాలని చూడటం చంద్రబాబు నీఛ మనస్తత్వానికి ప్రతీక అని అన్నారు. అసలు చంద్రబాబుని ఎలా అభివర్ణించాలో తెలియడం లేదన్నారు, ఆయన్ని వర్ణించడానికి తనకున్న భాషా పరిజ్ఞానం కూడా సరిపోవడంలేదని చెప్పారు వర్మ. ప్రజల ప్రాణాలతో తమ పాపులార్టీ పెంచుకోవాలని, తాము అధికారంలోకి రావాలని, అందలమెక్కాలని అప్పట్లో హిట్లర్‌, ముస్సోలినీ ప్రయత్నించారని, ఆ తర్వాత చంద్రబాబు అలాంటి లిస్ట్ లో చేరారని ఎద్దేవా చేశారు.

First Published:  5 Jan 2023 5:15 AM GMT
Next Story