Telugu Global
Andhra Pradesh

జగన్‌ పిచ్చితో వచ్చాడు, ఆస్తులూ పోయాయి, ఇప్పుడు ప్రాణమే పోయింది

తన తమ్ముడిపై ఎమ్మెల్సీ ఇక్బాల్‌, అతడి పీఏ గోపికృష్ణ కక్ష కట్టారని ఆరోపించారు. హత్య వెనుక ఎమ్మెల్సీ, అతడి పీఏ హస్తముందని మధుమతి ఆరోపించారు.

జగన్‌ పిచ్చితో వచ్చాడు, ఆస్తులూ పోయాయి, ఇప్పుడు ప్రాణమే పోయింది
X

హిందూపురం వైసీపీ మాజీ ఇన్‌చార్జ్ రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి.. వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్, అతడి పీఏ గోపికృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు. తన తమ్ముడికి వైఎస్‌ జగన్‌ అంటే పిచ్చి అని ఆ పిచ్చితోనే రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులన్ని పోగొట్టుకున్నారని ఆమె వివరించారు. చివరకు ఇప్పుడు త‌న త‌మ్ముడి ప్రాణం కూడా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీలో గుర్తింపు లేకపోయినా జగన్‌ కోసం నిలబడ్డారని చెప్పారు. అన్ని రకాలుగా తన తమ్ముడు నష్టపోయాడని.. జగనే న్యాయం చేయాలని ఆమె కోరారు.

తన తమ్ముడిపై ఎమ్మెల్సీ ఇక్బాల్‌, అతడి పీఏ గోపికృష్ణ కక్ష కట్టారని ఆరోపించారు. హత్య వెనుక ఎమ్మెల్సీ, అతడి పీఏ హస్తముందని మధుమతి ఆరోపించారు. సొంత పార్టీ నేతలపై హత్యారోపణల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్‌ హిందూపురం పంపుతున్నారు. నియోజకవర్గంలో అసలేం జరిగిందో, ఏం జరుగుతోందో తెలుసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు.

స్థానికంగా అందుబాటులో ఉండని ఎమ్మెల్సీ ఇక్బాల్.. తన పీఏ గోపికృష్ణకు నియోజకవర్గాన్ని అప్పగించడంతోనే వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరినట్టు చెబుతున్నారు. గోపికృష్ణ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి రావడాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. ప్రతిఘటించిన వారిని హత్యలు చేసేందుకు కూడా ఇక్బాల్‌, అతడి పీఏ తెగించారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

First Published:  11 Oct 2022 7:58 AM GMT
Next Story