Telugu Global
Andhra Pradesh

జగన్ పై విసుర్లు.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అందిస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని విమర్శించారు పురందరేశ్వరి. పంచాయతీలకు నిధులు అందని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్ పై విసుర్లు.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు
X

ఏపీ రాజకీయాల్లో పొత్తుల ఎత్తుల గురించి అప్పుడే ఓ అంచనాకు రాలేని పరిస్థితి. వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నది విపక్షాల అభిమతం, అయితే టీడీపీ, బీజేపీ మధ్య ఎక్కడో గ్యాప్ ఉంది. జనసేన మాత్రం అందరూ కలసి పోటీ చేయాలనుకుంటోంది. ఈ దశలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి పొత్తు రాజకీయాలపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతోందని చెప్పారామె. మిగిలిన పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం విషయంలో కూడా అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు పురందరేశ్వరి.

జగన్ పై విసుర్లు..

మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పురందరేశ్వరి. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందన్నారు. రూ.10 లక్షలు, 15 లక్షల పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం జగన్, రైతులకు నిజంగా ఏంమేలు చేశారని ప్రశ్నించారు పురందరేశ్వరి.

కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అందిస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని విమర్శించారు పురందరేశ్వరి. పంచాయతీలకు నిధులు అందని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సర్పంచ్‌ లు తనను కలిసి వారి బాధలు చెప్పుకున్నారని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా తప్పుకోలేదని స్పష్టం చేశారు పురందరేశ్వరి. పోలవరం నిర్మాణానికి ఖర్చవుతున్న ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తోందన్నారామె. పునరావాసానికి సంబంధించిన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదని తెలిపారు. పోలవరం లెక్కలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సవరణ కోరిందని ఆ విషయంలో తాము త్వరలో కేంద్ర జలశక్తి మంత్రిని కలవబోతున్నామని చెప్పారు పురందరేశ్వరి.

First Published:  26 July 2023 12:00 PM GMT
Next Story