Telugu Global
Andhra Pradesh

అదే నిజమైతే టీడీపీ ఆరోపణలు నమ్మాల్సిందే..

వైసీపీ నాయకులని చెప్పుకుంటున్నవారి బెదిరింపులకు భయపడి.. సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ అభిమానులు చొక్కాలు విప్పారు, జెండాలు తీసేశారు. వాటిని బ్యాగుల్లో పెట్టుకుని భయపడుతూనే ఆ ఊరుదాటారు.

అదే నిజమైతే టీడీపీ ఆరోపణలు నమ్మాల్సిందే..
X

పదే పదే ఏపీలో సైకో పాలన అంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు అధికార పార్టీ మాది పేదల ప్రభుత్వం అని చెబుతోంది. పార్టీలతో సంబంధం ఉన్నవారి నమ్మకాలు వేరు, తటస్థుల నమ్మకాలు వేరు. తటస్థులు ప్రభుత్వం గురించి ఏమనుకుంటారనేదే ఎన్నికల ఫలితాల్లో కనపడుతుంది. తాజాగా పుంగనూరులో జరిగిన ఘటన అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో తటస్థులను ఆలోచనలో పడేసేలా ఉంది.


పుంగనూరు పెద్దిరెడ్డి అడ్డానా..?

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కావచ్చు, ఆయన వైసీపీలో కీలక నేత, మంత్రి కూడా కావొచ్చు. కానీ ఆ నియోజకవర్గంలో ఇతర పార్టీల జెండాలు కనిపించకూడదంటే ఎలా..? ఒకవేళ కనిపించాయే అనుకుందాం, దాంతో వైసీపీకి వచ్చిన నష్టమేంటి..? వైనాట్ 175 అంటున్నవాళ్లు రెండు పచ్చ చొక్కాలు, రెండు సైకిళ్లు, రెండు టీడీపీ జెండాలు కనపడితే అంత భయపడిపోతారా..? శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్రగా వచ్చిన ఇద్దరు టీడీపీ అభిమానుల్ని పుంగనూరులో చెంగలాపురం సూరి అనే వ్యక్తి అవమానించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులోని భాష, వార్నింగ్ లు అన్నీ ప్రస్తుత ఏపీ రాజకీయాలను ప్రతిబింబించేలానే ఉన్నాయి. కానీ ఎక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చిన వారిని మరీ అంతలా బెదిరించాలా అనేదే ఇప్పుడు ప్రశ్న.

వైసీపీ నాయకులని చెప్పుకుంటున్నవారి బెదిరింపులకు భయపడి.. సైకిల్ యాత్ర చేపట్టిన టీడీపీ అభిమానులు చొక్కాలు విప్పారు, జెండాలు తీసేశారు. వాటిని బ్యాగుల్లో పెట్టుకుని భయపడుతూనే ఆ ఊరుదాటారు. ఈ వీడియోలో ఉన్నది అబద్ధం అని ఎవరూ కొట్టిపారేయలేరు. పోనీ అక్కడ టీడీపీ అభిమానులుగా ఉన్నవారు వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారనడానికి కూడా సాక్ష్యాలు లేవు. ఇది ఫేక్ న్యూస్ అని తీసిపారేస్తే ఎవరూ చేయగలిగిందేమీ లేదు. కానీ పుంగనూరులో ఇలానే బెదిరిస్తారు అనేది నిజమైతే మాత్రం.. టీడీపీ ఆరోపణ గురించి కాస్త ఆలోచించాల్సిందే.

First Published:  21 Oct 2023 2:51 AM GMT
Next Story