Telugu Global
Andhra Pradesh

పంచ్‌ ప్రభాకర్‌ వాళ్ల భూములూ కబ్జా

తాను ఇంతగా వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటే.. తన పార్టీ అనుకున్న వారే తన దగ్గరి బంధువుల భూములను కాజేస్తున్నారని పంచ్‌ ప్రభాకర్ వాపోతూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

పంచ్‌ ప్రభాకర్‌ వాళ్ల భూములూ కబ్జా
X

అమెరికాలో ఉండే డాక్టర్‌ పంచ్ ప్రభాకర్.. వైసీపీ పక్షాన, టీడీపీకి వ్యతిరేకంగా ఏ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారో చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆయనకే వైసీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదుర‌య్యాయి. పంచ్ ప్రభాకర్ బావమరిది భూమిని వైసీపీ నేతలే కబ్జా చేశారు. ఈ విషయాన్ని పంచ్‌ ప్రభాకరే చెప్పుకుని వాపోయారు.

తాను ఇంతగా వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటే.. తన పార్టీ అనుకున్న వారే తన దగ్గరి బంధువుల భూములను కాజేస్తున్నారని పంచ్‌ ప్రభాకర్ వాపోతూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఒంగోలులోని గద్దలగుంటలో దాదాపు 20ఏళ్ల క్రితం పంచ్‌ ప్రభాకర్ బావమరిది స్థలం కొన్నారు. ప్రభాకర్ బావమరిదితో పాటు మరో 22 మంది ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్న వారు మొత్తం రెండున్నర ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమికి తప్పుడు డాక్యుమెంట్లు, ఫేక్ లింక్ డాక్యుమెంట్లు సృష్టించి కొందరు ఆ భూమిని కబ్జా చేశారని పంచ్ ప్రభాకర్ చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, ఒంగోలు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు హస్తముందని పంచ్ ప్రభాకర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాధవరావుతో మాట్లాడేందుకు తాను ప్రయత్నించినా వారు స్పందించడం లేదని ప్రభాకర్ ఆవేదన చెందారు. ఇలాంటి వారు చాలా మంది తయారవుతున్నారని వారిని నియంత్రించాలని సీఎం జగన్‌ను పంచ్ ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత ఈ అంశంపై స్పందించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చినట్టు చెబుతున్నారు. మాధవరావుపై బాలినేని కూడా సీరియస్ అయినట్టు చెబుతున్నారు. అయితే జగన్‌కు మద్దతుగా గట్టిగా వాదించే పంచ్‌ ప్రభాకరే తన బావమరిది భూమిని కబ్జా చేస్తున్నారని వాపోవడంతో .. దుర్మార్గులకు తన, మన అన్న తేడా ఉండదు ఇప్పటికైనా తెలుసుకోండి అంటూ ఈ ఘటన ఆధారంగా టీడీపీ వాళ్లు వైసీపీపై గురిపెట్టారు. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్లినట్టు చెబుతున్నారు. దాంతో ముఖ్యమంత్రి జగన్‌ చాలా సీరియస్‌ అయినట్టు చర్చ జరుగుతోంది.

First Published:  11 Sep 2022 9:34 AM GMT
Next Story