Telugu Global
Andhra Pradesh

మార్గదర్శిని గట్టిగా ఫిక్స్ చేస్తున్నారా?

ఇతర రాష్ట్రాల్లో కూడా దాడులు చేసి కేసులు నమోదు చేయటానికి వీలుగా ఆయా రాష్ట్రాల్లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ డైరెక్ట్ ట్యాక్సెస్, ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, జీఎస్టీ లాంటి కీలక సంస్థ‌లను దర్యాప్తు చేయాలని ఏపీ సీఐడీ రిక్వెస్టు చేసింది.

మార్గదర్శిని గట్టిగా ఫిక్స్ చేస్తున్నారా?
X

మార్గదర్శి చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని బ్రాంచ్ ఆఫీసులపైన కూడా దాడులు చేయటానికి రంగం సిద్ధమవుతోంది. మార్గదర్శి బ్రాంచ్ ఆఫీసులపై దాడుల విషయంలో ఇప్పటికి ఏపీ సీఐడీ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో కూడా దాడులు చేసి కేసులు నమోదు చేయటానికి వీలుగా ఆయా రాష్ట్రాల్లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ డైరెక్ట్ ట్యాక్సెస్, ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, జీఎస్టీ లాంటి కీలక సంస్థ‌లను దర్యాప్తు చేయాలని సీఐడీ రిక్వెస్టు చేసింది.

ఏపీలోని 38 బ్రాంచిల్లో జరిగిన దాడుల్లో సుమారు రూ. 400 కోట్లు అవినీతి, అక్రమాలకు యాజమాన్యం పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయాలన్నింటినీపై కేంద్ర దర్యాప్తు సంస్థ‌లకు ఏపీసీఐడీ స‌మాచారం పంపించింది. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే అనుమానంతోనే పై సంస్థ‌లను దర్యాప్తు కోసం రంగంలోకి దిగాలని సీఐడీ రిక్వెస్టు చేసింది. పై దర్యాప్తు సంస్థ‌లు కూడా దర్యాప్తుకు సానుకూలంగా స్పందించాయని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.

సీఐడి, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు చేసిన దాడుల్లో మార్గదర్శిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు ఏమాత్రం సహకరించలేదని ఇప్పటికే సంజయ్ ప్రకటించారు. అయితే తమకు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తేనే వందల కోట్ల రూపాయల అక్రమాలు బయటపడినట్లు చెప్పారు. యాజమాన్యం సహకరించి తాము అడిగిన అన్నీ రికార్డులను అందిస్తే సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమాలన్నింటినీ బయటపెడతామని సీఐడి అంటోంది.

చిట్ ఫండ్ సంస్థ‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలను చిట్ ఫండేతర అవసరాలకు, వ్యాపారాలకు యాజమాన్యం మళ్ళించినట్లు కొన్ని ఆధారాలు దొరికినట్లు సంజయ్ చెప్పారు. ఇదంతా చూస్తుంటే పై మూడు రాష్ట్రాల్లో కూడా మార్గదర్శిపై దాడులకు ప్లాన్ రెడీ అవుతున్నట్లు అర్థ‌మవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్ధలు కూడా రంగంలోకి దిగితే దాడులు మొదలుపెట్టి వీలైనంత తొందరలోనే బ్రాంచ్‌లను మూయించేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే మార్గదర్శి చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తున్న విషయం అర్థమైపోతోంది.

First Published:  16 March 2023 8:35 AM GMT
Next Story