Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి దోమతెర, ఏసీ.. కొనిస్తా!

ఏదిక్కైనా వెళ్లండి బాగుపడతారు కానీ, దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అని ఆయన కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు పోసాని.

చంద్రబాబుకి దోమతెర, ఏసీ.. కొనిస్తా!
X

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని దోమలు కుడుతున్నాయని, ఆయన చన్నీళ్ల స్నానం చేస్తున్నారని, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని.. ఆయన్ను ములాఖత్ లో కలసి వచ్చిన నాయకులు, కుటుంబ సభ్యులు, బయట నుంచి వార్తలు వినిపించే కొంతమంది మీడియా ప్రతినిధులు బాధపడుతున్న విషయం తెలిసిందే. జైలులో ఉంటే ఖైదీలా ఉండాలి కానీ, రాచమర్యాదలు ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ వ్యవహారంపై కాస్త సెటైరిక్ గా స్పందించారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి. ఆయనకు అవసరమైన దోమల మందు, దోమతెరలు తానే పంపిస్తానన్నారు. చంద్రబాబు కోసం తానే ఏసీ కొంటానని, ఎవరైనా జైలులోకి వెళ్లి ఆయనకు ఇచ్చిరావాలన్నారు.

రికార్డు 'స్టే'ల చంద్రబాబు..

తనపై వేసిన కేసుల నుంచి తప్పించుకోడానికి కోర్టుల నుంచి ఇప్పటి వరకు 17 స్టేలు తెచ్చుకుని చంద్రబాబు రికార్డు సృష్టించారన్నారు పోసాని. అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారన్నారు. జైలులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా? అక్కడ ఉండి కూడా ర్యాలీలు, ధర్నాల గురించి ఆలోచిస్తావెందుకు అంటూ చంద్రబాబుకి సుద్దులు చెప్పారు పోసాని. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకోవాలని, ఏడాది పాటు జైలులో ఉండి బయటకు వచ్చేటప్పుడు నిజాయతీగా వస్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.

నారా బ్రాహ్మణి మాటలు వింటే నవ్వొస్తోందన్నారు పోసాని. ఆమె తాత ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపింది, చెప్పుతో కొట్టింది ఎవరో బ్రాహ్మణి చెప్పాలన్నారు. ఏదిక్కైనా వెళ్లండి బాగుపడతారు కానీ, దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అని ఆయన కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకి ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు పోసాని. ఆయన అవినీతి గురించి అందరికీ తెలుసన్నారు. కానీ ఇప్పుడు పాపం పండిందని, అందుకే జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.


First Published:  19 Sep 2023 10:18 AM GMT
Next Story