Telugu Global
Andhra Pradesh

వినుకొండలో ఉద్రిక్తత.. గాల్లోకి పోలీసుల కాల్పులు

ఏపీలో వాతావరణం చల్లగానే ఉన్నా.. రాజకీయ వాతావరణం మాత్రం బాగా వేడెక్కింది. పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వినుకొండలో ఉద్రిక్తత.. గాల్లోకి పోలీసుల కాల్పులు
X

ఓవైపు వైసీపీ రాళ్లదాడి..

మరోవైపు టీడీపీ కర్రలతో దాడి..

ఇరు వర్గాలు రోడ్డుపై మోహరించి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి.

ఆందోళనకారుల్ని చెదరగొట్టడం పోలీసులకు తలకు మించిన వ్యవహారంలా మారింది.

ఒక్కసారిగా సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు, ఎక్కడివారక్కడ పరుగులందుకున్నారు.

పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది.

ఇదీ ఏపీలోని వినుకొండలో ప్రస్తుత పరిస్థితి.

ఏపీలో వాతావరణం చల్లగానే ఉన్నా.. రాజకీయ వాతావరణం మాత్రం బాగా వేడెక్కింది. పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య పరస్పర రాళ్లదాడితో అక్కడ తీవ్ర ఉత్కంఠ రేగింది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిగే పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ రాజకీయ గొడవలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు.

అసలేం జరిగింది..?

వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జీవీ ఆంజనేయులుపై అక్రమంగా కేసులు పెట్టారని, వాటిని ఎత్తివేయాలంటూ పట్టణంలో టీడీపీ ఆందోళనకు దిగింది. అదే సమయంలో సురక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ దారిలో వెళ్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఆయన కారుని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు.

అకారణంగా పోలీసులు తమపై లాఠీ చార్జి చేశారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. టీడీపీ వాళ్లే తన కారుపై రాళ్లదాడి చేశారని, ఈ దాడిలో తన అనుచరులు గాయపడ్డారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. రెండు రోజుల క్రితం తన డెయిరీ ఫామ్‌ ను ధ్వంసం చేశారని, జీవీ ఆంజనేయులుకు ప్రజాభిమానం లేదని, గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  27 July 2023 9:06 AM GMT
Next Story